ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ కార్మికుల కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడంపై కార్మికుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆమోదం తెలుపడంతో వరంగల్ రీజియన్ పరిధిలోని 4300 మంది కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఇక ఆర్టీసీ కార్మికులు సర్కారు ఉద్యోగులుగా మారగా, తమ జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్కు కార్మికలోకం కృతజ్ఞతలు తెలుపుతున్నది.
– హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 14
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 14: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ఇక ప్రభుత్వ సంస్థగా మారనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆమోదం తెలుపగా కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు కాగా, వరంగల్ రీజియన్లో 4300 మంది ఉన్నారు.
కల సాకారమైన రోజు..
ఆరు దశాబ్దాలకుపైగా కార్పొరేషన్గా కొనసాగిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. ఆర్టీసీ ఉద్యోగుల ఏండ్ల నాటి కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. ఎట్టకేలకు బిల్లు ఆమోదం పొందడంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఇక ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కార్పొరేషన్ రూల్స్ ప్రకారం కొనసాగనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్సీనే ఆర్టీసీ ఉద్యోగులకూ వర్తిస్తుంది. కార్మికుల బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించనుంది. ఆర్టీసీ కార్పొరేషన్, వాటి ఆస్తులు అదేవిధంగా ఉంటాయి. ఆర్టీసీ ఉద్యోగుల విరమణ ప్రయోజనాలను నిర్ణయించనున్నారు.
4300 మంది జీవితాల్లో వెలుగులు..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో వరంగల్ రీజియన్ పరిధిలో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, సూపర్వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది సుమారు 4300 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. నెలరోజుల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ ఇన్నాళ్లూ నాన్చివేత ధోరణిని అవలంబించి, ఎట్టకేలకు గురువారం ఆమోదించడంతో ఆర్టీసీ కార్మికుల ఆకాంక్ష ఫలించింది. సీఎం కేసీఆర్కు ఆర్టీసీ సంఘాల నేతలు, ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితం దక్కిందని సంబురపడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం వరంగల్-1 డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో సాంబయ్య, సేఫ్టీ వార్డెన్ డీ యాదగిరి, రాము, ఇంద్రసేన, కేఎన్చారి, ఎం.రాజు పాల్గొన్నారు.
మా కష్టాలను గుర్తించారు
సీఎం కేసీఆర్ పెద్దమనసుతో మా కష్టాలను గుర్తించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. 2011లో సకలజనుల సమ్మె సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు మాట నిలబెట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్రను గుర్తించి న్యాయం చేశారు. పలు దఫాలుగా ఎంప్లాయీస్ యూనియన్ చేస్తున్న ఉద్యమాలను, పోరాటాలను, విజ్ఞప్తులను అర్థం చేసుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు.
-ఎస్ఆర్ కుమార్, ఆర్టీజీ జాక్ నాయకుడు
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం సంతోషంగా ఉంది. నేను 30 సంవత్సరాలుగా డ్రైవర్గా పనిచేస్తున్న. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి ప్రభుత్వం తగిన న్యాయం చేసింది. సీఎం కేసీఆర్కు ఎంతో రుణపడి ఉంటాం. ప్రజలకు మెరుగైన సేవలందిస్తాం. రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం.
– బ్రాహ్మచారి, డ్రైవర్
ఆర్టీసీ బలోపేతం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం గర్వించదగిన విషయం. ఆర్టీసీ సిబ్బంది తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ఆర్టీసీని బలోపేతం చేసేందుకే సర్కారులో విలీనం చేశారు. కార్మికులందరికీ తగిన గుర్తింపునిచ్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
-రాతిపెల్లి సాంబయ్య, సూపర్వైజర్
సీఎం కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సీఎం కేసీఆర్ తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం. ఆర్టీసీ కార్మికులకు సీఎం పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఈసారి దసరా పండుగ కానుకగా ఇచ్చారు. ప్రతి ఉద్యోగి సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారు. ఎన్నో ఏళ్ల మా కలను నెరవేర్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.
-శ్రీపాల్బాబు, మెకానిక్
చరిత్రలో నిలిచే నిర్ణయం
నర్సంపేట రూరల్ : నెల రోజుల నుంచి ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఆర్టీసీ ప్రభుత్వ విలీన బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలుపడం హర్షణీయం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో కార్మికుల ఆత్మగౌరవాన్ని పెంచినట్లయింది. సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయేలా నిర్ణయం తీసుకున్నారు. మా జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-గొలనకొండ వేణు, ఆర్టీసీ కార్మికుడు, గురిజాల, నర్సంపేట మండలం