హనుమకొండ, అక్టోబర్ 16 : బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ప్రజలు నచ్చేలా.. మెచ్చేలా ఉందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సోమవారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా మేనిఫెస్టో పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. తనపై నమ్మకంతో సీఎం కేసీఆర్ బీ ఫాం ఇచ్చారని, అందుకు సీఎం, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నాళ్లూ తన గెలుపులో భాగస్వాములైన గులాబీ కుటుంబ సభ్యులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మేనిఫెస్టోను ప్రతి గడపకూ తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయినా అంబేదర్ విగ్రహాన్ని దళితవాడల్లో పెట్టలేకపోయారని, ప్రత్యేక తెలంగాణలో సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు భారీ విగ్రహం నెలకొల్పిన మానవతావాది కేసీఆర్ అన్నారు.
కరోనా కష్టకాలంలో 46వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా ముందుకు వెళ్తున్నామన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిదని పేర్కొన్నారు. మరోమారు ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఈ మేనిఫెస్టోలో పొందుపర్చారన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్న బీఆర్ఎస్ పార్టీని ఈ సారి కూడాఆశీర్వదిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పింఛన్ను రూ. 3016కు పెంచి ప్రతి సంవత్సరం రూ. 500ల చొప్పున పెంచుతూ రూ. 5016 చేస్తామన్నారు. ఎంతోమంది కరోనా బారిన పడి చనిపోవడంతో వారి కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని, వాటిని గుర్తించిన సీఎం కేసీఆర్ బీమా పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇవ్వడమే కాకుండా వికలాంగుల పింఛన్ను రూ. 4016 నుంచి రూ. 6వేలకు పెంచుతామన్నారు. రైతుబంధును రూ. 16వేలకు పెంచనున్నట్లు చెప్పారు. అర్హులైన నిరుపేద పేద మహిళలకు ప్రతి నెలా రూ. 3వేల అందజేయనున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల మహిళలు మళ్లీ కట్టెల పొయ్యి వాడే పరిస్థితి వచ్చిందని, బీపీఎల్ కుటుంబాలు, జర్నలిస్టులకు రూ. 400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రతి డివిజన్లో యాత్ర..
నియోజకవర్గ పరిధిలో ప్రతి డివిజన్లో ప్రజా ఆశీర్వాద యాత్ర చేపడుతున్నట్లు చీఫ్ విప్ తెలిపారు. 59, 60 డివిజన్లో ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల్లోకి వస్తూ బీఆర్ఎస్పై కాంగ్రేస్, బీజేపీలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఒక నాయకుడు గడియారాలు, మరో నాయకుడు కుకర్లు పంచి మభ్య పెడుతున్నారని, ప్రజలు మాత్రం పని చేసే నాయకుడినే ఎన్నుకుంటారని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ. 10లక్షల నుంచి 15లక్షలకు పెంచామని, అసైన్డ్ భూములు గలవారికి పట్టాలు ఇస్తానని సీఎం చెప్పారని అన్నారు. వరంగల్లో ఐటీ టవర్ నిర్మాణానికి స్థలాన్ని సేకరించామని, రెండు వేల ఏళ్ల చరిత్ర ఉన్న అగ్గలయ్య గుట్టను అభివృద్ధి చేయడంతో ఎంతో మంది జైనులు వచ్చి సందర్శిస్తున్నారని తెలిపారు. త్వరలోనే కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం అవుతుందని, రూ. 30కోట్లతో భద్రకాళీ మాడ వీధులు నిర్మించామని చెప్పారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు దేవాలయ అభివృద్ధికి నయా పైసా ఇవ్వలేదని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో 50వేల మెజార్టీతో గెలుస్తాననే ఆత్మ విశ్వాసం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఈగ మల్లేశం పాల్గొన్నారు.