హనుమకొండ చౌరస్తా, నవంబర్ 22: తాను ప్రజా సంక్షేమం కోసం నిస్వార్థం, నిజాయితీ, నిబద్ధతతో పని చేశానని, తెలంగాణ ఉద్యమకారుడికి.. ఉద్యమకారులను కాల్చిన వ్యక్తి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్ ప్రెస్క్లబ్లో బుధవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ తాను 30 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నానని, జీవితంలో అం చెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చినట్లు చెప్పా రు. జర్నలిస్టుల సలహాలు, సూచనలు తీసుకొని వారి మద్దతుతో ఈ స్థానానికి వచ్చానని, వారి సహకారం మరువలేనిదన్నారు. 2004 ఎన్నికల్లో టీడీపీ మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు విభేదించానని, ఆ రోజు కూడా ప్రెస్ మిత్రులందరూ తనకు సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఎన్నికల్లో విస్తృత ప్రచారం కల్పించారని, అప్పుడు నాలుగు పార్టీలకు దీటుగా 59 వేల మెజారిటీ వచ్చిందని, 1200 స్వల్ప మెజార్టీతో ఓడిపోయినట్లు తెలిపారు. కాళోజీ ఆశయ సాధన కోసం, ప్రొఫెసర్ జయశంకర్ ఆశీర్వాదంతో బీఆర్ఎస్లో చేరినట్లు వివరించారు.
అప్పటి ప్రభుత్వంలో సోదరుడు ప్రణయ్భాసర్ తెలంగాణ పదాన్ని ఉచ్చరించినప్పుడు అడ్డుకున్నారని గుర్తుచేశారు. 2005లో కేసీఆర్ ప్రత్యేకంగా టీఆర్ఎస్లోకి ఆహ్వానించారని, ఆనాటి ఉద్యమనేత ఆహ్వానం మేరకు, అప్ప టి పార్లమెంటు సభ్యుడు వినోద్కుమార్ సూచన మేరకు పార్టీలో చేరానన్నారు. 2009 టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి నియోజకవర్గంలోని జర్నలిస్టులు, పార్టీ శ్రేణుల కృషి, ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందినట్లు చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా పార్టీని వీడకుండా ప్రజల ఆకాంక్ష మేరకు రాజీనామా చేసి తిరిగి గెలుపొందానన్నారు. తాను లోకల్లోనే ఉంటానని, విదేశాలు, వినోదాలు, విహారయాత్రలకు వెళ్లకుండా, కరోనా కష్ట సమయంలోనూ ప్రజలకు విశేష సేవలు అందించిన ట్లు గుర్తుచేసుకున్నారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశానని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించినట్లు చెప్పారు. అనేక సం ఘాలు తనకు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదాయ్య, కోశాధికారి బోళ్ల అమర్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి, టీయూడబ్ల్యూజే(143) జిల్లా అధ్యక్షుడు సుధాకర్, టీయూడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాసాగర్, జర్నలిస్టులు పాల్గొన్నారు.