దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న పథకం
అభినవ అంబేద్కర్ సీఎం కేసీఆర్
విడుతల వారీగా 18వేల కుటుంబాలకు లబ్ధి
డిమాండ్ ఉన్న యూనిట్లే ఎంచుకోవాలి
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పండుగలా ఆస్తుల పంపిణీ
రూ.3కోట్లతో 30 మందికి యూనిట్ల అందజేత
మురిసిన గీసుగొండ, సంగెం మండలాల లబ్ధిదారులు
పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, కలెక్టర్ గోపి
గీసుగొండ, మే 20: గీసుగొండ మండలం ఊకల్ సొసైటీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం దళితబంధు యూనిట్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. రూ.3కోట్లతో గీసుగొండ, సంగెం మండలాల్లోని 30మందికి 6 ఆటోలు, 8 కార్లు, 11 ట్రాక్టర్లు, ఇద్దరికి టెంట్ హౌస్, ఒకరికి కిరాణా షాపు, మరొకరికి గొర్రెల యూనిట్ను జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, కలెక్టర్ బీ గోపితో కలిసి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పంపిణీ చేయగా వాటిని అందుకున్న లబ్ధిదారుల్లో సంతోషం వెల్లివిరిసింది. ఎన్నో ఏండ్ల నుంచి పేదరికంలో మగ్గుతున్న తమ జీవితాల్లో సీఎం కేసీఆర్ దళితబంధు రూపంలో కొత్త వెలుగు నింపారని సంతోషం వ్యక్తంచేశారు. కూలీనాలీ చేసుకొనే తమకు కార్లు, ట్రాక్టర్లే గాక కోరుకున్న యూనిట్లు ఇచ్చి ఓనర్లను చేశారంటూ కేసీఆర్ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు.
దళితబంధు పథకం దేశానికే దిక్సూచిగా నిలిచిందని, ప్రపంచ దేశాల్లోనే ఎక్కడా లేని పథకాన్ని సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అనంతరం రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ కలలుగన్న స్వరాజ్య స్థాపనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇన్నాళ్లూ ప్రతిపక్షాలు దళితులను ఓట్ల కోసం వాడుకుంటే, సీఎం కేసీఆర్ మాత్రం వారు ఆర్థికంగా ఎదిగేందుకు దళితబంధు రూపంలో ఆసరాగా నిలుస్తున్నారన్నారు. దేశానికి కేసీఆర్ పాలన ఆవసరమని అనేక రాష్ర్టాల ప్రజలు, నాయకులు కోరుకుంటున్నారన్నారు. దళితబంధు పథకాన్ని చూసి ప్రతిపక్ష నాయకులకు నిద్రపట్టడం లేదన్నారు. పార్టీలకతీతంగా పరకాల నియోజకవర్గంలోని 18వేల దళిత కుటుంబాలకు విడుతల వారీగా లబ్ధి చేకూరుస్తామన్నారు. అందరూ కార్లు, ట్రాక్టర్లే కాకుండా గ్రామాల్లో కిరాణా షాపులు, కోళ్ల ఫారాలు, డైరీ ఫామ్లు ఎంచుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, దళితబంధు ప్రత్యేకాధికారి బాలకృష్ణ, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, గీసుగొండ, సంగెం ఎంపీపీలు భీమగాని సౌజన్య, కందకట్ల కళావతి, ఎల్డీఎం సత్యజిత్, వెహికిల్ ఇన్స్పెక్టర్ వెంకన్న, తహసీల్దార్ సుహాసిని, ఎంపీడీవో రమేశ్, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, సంగెం రైతు బంధు కో ఆర్డినేటర్ నరహరి, గీసుగొండ, మరియపురం, ఊకల్ సర్పంచ్లు దౌడు బాబు, అల్లం బాలిరెడ్డి, నాగదేవత, ఊకల్ ఎంపీటీసీ బేతినేని వీరరావు,టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గౌరవంగా బతుకుతున్నం..
నేను ఇప్పుడు ట్రాక్టర్కు ఓనర్నయ్యాను. తెలంగాణలో దళితులను ఆదుకుంటున్నది సీఎం కేసీఆరే మాత్రమే. ఎన్నో ఏండ్ల నుంచి మేము పేదరికంలో మగ్గినం. దళిత బంధుతో మా బతుకుల్లో వెలుగు నిండినయ్.
– దౌడ నర్సయ్య, గీసుగొండ, లబ్ధిదారుడు
మాకు మంచి రోజులొచ్చాయి..
సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న దళితబంధుతో మాకు మంచి రోజులు వచ్చాయి. దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. ఇదివరకు ఉన్న లీడర్లు మమ్ముల అస్సలు పట్టించుకోలే.
– గుండేటి చంద్రమౌళి, లబ్ధిదారుడు
సీఎం కేసీఆర్ దేవుడు..
దళితబంధు ఇచ్చి నా కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచిన సీఎం కేసీఆర్ దేవుడు. తెలంగాణలో వచ్చే తరానికి కూడా కేసీఆరే సీఎంగా ఉండాలె. దళితుల గురించిన ఆలోచించే ఏకైక నాయకుడు ఆయనే. రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా పథకాలు అమలవుతున్నయ్.
– మొట్టుపల్లి రాజు, సంగెం, లబ్ధిదారుడు
కారుకు ఓనరునయ్యా..
సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధుతో కారుకు ఓనరునయ్యా. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన యూనిట్ను సద్వినియోగం చేసుకుంటా. మిగతా వాళ్లకు ఆదర్శంగా ఉంటా. ఈ పథకం కింద నాకు అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు. – కోటా ప్రమోద్,
గీసుగొండ, లబ్ధిదారుడు
చాలా సంతోషంగా ఉంది..
దళితబంధు పథకం వస్తదనుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నాకు ట్రాక్టర్ వచ్చింది. ఇప్పడు చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబమంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటుంది. ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు ఎస్సీలను పట్టించుకోలేదు.
– దౌడు బాబు, గీసుగొండ, లబ్ధిదారుడు
ఆర్థికంగా ఎదగాలి.. :
– గండ్ర జ్యోతి, జడ్పీ చైర్పర్సన్
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతోంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి పథకాలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వనివీ అమలు చేస్తున్నాం. దళితబంధు పథకాన్ని సక్రమంగా వినియోగించుకొని దళితులు ఆర్థికంగా ఎదగాలి.
కోరుకున్నవే ఇస్తాం.
– బీ గోపి, కలెక్టర్
దళితబంధు లబ్ధిదారులు కోరుకున్న యూనిట్లనే అందజేస్తున్నాం. ఇప్పటికే నియోజకవర్గంలో 100 మందికి ఆస్తులు పంపిణీ చేశాం. మరో 1500 మందికి త్వరలోనే అందజేస్తాం. మొదటి విడుతలో యూనిట్లు అందుకున్న వారు సక్రమంగా వినియోగించుకుని రెండో విడుత లబ్ధిదారులకు స్ఫూర్తిగా నిలవాలి. డిమాండు ఉన్న యూనిట్లనే ఎంచుకోవాలి.