వరంగల్ జిల్లాలో దళితబంధు పథకం రెండో విడుత అమలుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఎంపికకు శ్రీకారం చుట్టారు. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. పర్యవేక్షణ కోసం కలెక్టర్ స్పెషలాఫీసర్లను నియమించారు. వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. దళితులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమల్లోకి తీసుకురాగా, దశలవారీగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి. వంద శాతం సబ్సిడీతో రూ.10 లక్షల యూనిట్ను అందజేసి దళితుల కుటుంబాల్లో ప్రభుత్వం వెలుగులు నింపుతున్నది.
వరంగల్, జూలై 10 (నమస్తేతెలంగాణ) : జిల్లాలో దళితబంధు పథకం రెండోవిడుత అమలు కు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రభు త్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఎంపికకు శ్రీకారం చుట్టారు. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. పర్యవేక్షణ కోసం కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. దళితులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దళితబంధును అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. దశలవారీగా ఈ పథకం ద్వారా దళితుల్లో ప్రతి కుటుంబానికి వంద శాతం సబ్సిడీతో కూడిన రూ.10 లక్షల యూనిట్ను అందజేసే దిశగా ముందుకు వెళ్తున్నది.
ఈ క్రమం లో గత ఏడాది తొలివిడుత ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 100 మందికి దళితబంధు పథకం ద్వారా వంద యూనిట్లను పంపిణీ చేసింది. ఒక్కో యూనిట్ విలువ రూ.10 లక్షలు. లబ్ధిదారులు కోరిన యూనిట్లను ప్రభుత్వం అందజేసింది. ఈ లెక్కన జిల్లాలో దళితబంధు పథకం ద్వారా 303 మంది రూ.30.30 కోట్ల యూనిట్లు పొందారు. ట్రాక్టర్లు, టాక్సీ కార్లు, జేసీబీలు, హార్వెస్టర్లు, ఆటో ట్రాలీల వంటి వాహనాలను దళితబంధు పథకం నుంచి తీసుకున్నారు. టైల్స్, ఆటో మొబైల్, స్పేర్ పార్ట్స్, బుక్ స్టాల్స్, బిల్డింగ్ మెటీరియల్, హార్డ్వేర్, సెల్ వరల్డ్, సిమెంట్, స్టీల్, కిరాణం, జనరల్ స్టోర్, మెడికల్, టెంట్హౌస్, క్లాత్ ఎంపోరియం, ఎలక్ట్రికల్, ఎరువులు, ఫుట్వేర్, ఫర్నిచర్ దుకాణం, సెంట్రింగ్, కాంక్రీట్ మిక్చర్ యూనిట్, పేపర్ ప్లేట్ల తయారీ, మినీ డెయిరీ వంటి యూనిట్లను లబ్ధిదారులు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వం తమకు అందజేసిన రూ.10 లక్షల యూనిట్తో ఉపాధి పొందుతున్నారు. గతంలో వివిధ రంగాల్లో కార్మికులు, గుమస్తాలుగా పని చేసిన వారు దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసిన యూనిట్ల నిర్వహణతో ప్రస్తుతం ఓనర్లుగా మారారు. ప్రభుత్వం ఉచితంగా రూ.10 లక్షల యూనిట్లను అందజేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దళితబంధు పథకంతో తమ జీవితాల్లో వెలుగు నింపిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని చెబుతున్నారు. ఈ ఏడాది దళితబంధు పథకం ద్వారా రెండోవిడుత ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో 1,100 యూనిట్లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల మార్గదర్శకాలను విడుదల చేసింది.
ప్రత్యేక అధికారులు ఎవరంటే…
జిల్లాలో వరంగల్తూర్పు, నర్సంపేట శాసనసభ నియోజకవర్గాల పరిధి పూర్తిగా ఈ జిల్లాలోనే ఉంది. ఈ నేపథ్యంలో దళితబంధు పథకం ద్వారా రెండోవిడుత వరంగల్ తూర్పునకు 1,100, నర్సంపేటకు 1,100 చొప్పున ఈ రెండు నియోజకవర్గాల్లో 2,200 యూనిట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. వర్ధన్నపేట నియోజకవర్గంలోవర్ధన్నపేట, పర్వతగిరి మండలాలతో పాటు జీడబ్ల్యూఎంసీ పరిధిలోని మూడు డివిజన్లు, పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ, సంగెం మండలాలతో పాటు జీడబ్ల్యూఎంసీ పరిధిలోని మూడు డివిజన్లు, పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలం జిల్లా పరిధిలో ఉన్నందున ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి మరో 1,100కు పైగా యూనిట్ల పంపిణీ జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
జిల్లాలో ఐదు నియోజకవర్గాల పరిధిలో దళితబంధు పథకం రెండోవిడుత కార్యక్రమం ద్వారా మొత్తం మూడు వేలకుపైగా యూనిట్లను పంపిణీ చేయాల్సి ఉంటుందనే ఆలోచనతో అడుగులు వేస్తున్నారు. దళితబంధు అమలు పర్యవేక్షణకు కలెక్టర్ ప్రావీణ్య నియోజకవర్గానికొక ప్రత్యేక అధికారిని నియమించారు. నర్సంపేటకు ఎస్సీ డెవలప్మెంట్ జిల్లా అధికారి పీ భాగ్యలక్ష్మి, వరంగల్ తూర్పునకు పరిశ్రమల శాఖ జిల్లా జనరల్ మేనేజర్ ఏ నర్సింహమూర్తి, వర్ధన్నపేటకు జిల్లా సహకార అధికారి బీ సంజీవరెడ్డి, పరకాలకు పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ ఎం బాలకృష్ణ, పాలకుర్తికి మత్స్యశాఖ జిల్లా అధికారి పీ నరేశ్కుమార్ నాయుడును స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తూ ఆమె కొద్దిరోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు.
నర్సంపేట మున్సిపాలిటీతో పాటు నర్సంపేట, చెన్నారావుపేట, దుగ్గొండి, ఖానాపురం, నల్లబెల్లి, నెక్కొండ మండలాల్లో భాగ్యలక్ష్మి, వరంగల్, ఖిలా వరంగల్ మండలాల్లో నర్సింహామూర్తి, వర్ధన్నపేట మున్సిపాలిటీతో పాటు వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో సంజీవరెడ్డి, గీసుగొండ, సంగెం మండలాల్లో బాలకృష్ణ, రాయపర్తి మండలంలో నరేశ్కుమార్ దళితబంధు అమలును పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కూడా మొదలైంది. ఆయా మండలాల్లో ఎంపీడీవో, మున్సిపాలిటీలో లోకల్ కమిషనర్ ద్వారా ఈ దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు దళితబంధు పోర్టల్ ఓపెనింగ్ యూజర్ ఐడీ నెంబర్స్, పాస్వర్డ్ను అం దజేసింది. ఇప్పటికే కొందరు దళితబంధు యూనిట్ల కోసం తమ దరఖాస్తులను అందజేశారు.