నైరుతి పవనాల రాకతో జిల్లాలో రెండు రోజుల నుంచి మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. శుక్రవారం తరిగొప్పులలో అత్యధికంగా 35.6 మి.మీ వర్షం కురవగా, అత్యల్పంగా లింగాలఘనపురంలో 1.8 మి.మీ కురిసింది. ఈసారి ఆలస్యంగానైనా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లపై దృష్టి సారించారు. ఈ వానకాలం సీజన్లో 3.76 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు
– జనగామ, జూన్ 23(నమస్తే తెలంగాణ)
జనగామ, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : నైరుతీ రుతు పవనాల ప్రవేశంతో వాతావరణం చల్లబడడంతో జిల్లాలో వానకాలం పంటల సాగు మొదలైంది. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయనే వాతావరణశాఖ సూచనలతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో పొలంబాట పట్టారు. జిల్లాలో ఇటీవల ఓ మోస్తరు వర్షం కురవడంతో ఇప్పటికే దుక్కిదున్ని సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాలు నాటేందుకు సన్నద్దమయ్యారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు దుకాణాల్లో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోళ్ల రైతుల సందడి కనిపించింది. గతంలో ఏటా వానకాలం సీజన్లో దళారులు, వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుల కోసం తిరిగే రైతులు ఈసారి ముందస్తుగా అందుతున్న సర్కారు సాయంతో ఫర్టిలైజర్స్ షాపుల్లో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్నారు. వేసవిలో ఒక సాలు దున్నకాలు పూర్తిచేసి చేన్లలో చెత్త ఏరి, కాల్చడం పూర్తిచేసిన రైతులు ఇటీవలి వర్షపు జల్లులతో తుది విడుత దుక్కులు దున్ని భూమి చదును చేయడం..సేంద్రియ ఎరువులు చల్లి భూమిని ఇరువాలు సాలు దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు రెండురోజుల్లో పంట పెట్టుబడికి ప్రభుత్వం సాయం అందనుండడంతో ఇటు విత్తనాలు, అటు ఎరువులు, వ్యవసాయ పరికరాలను కొనుగోలుకు రైతాంగం సిద్ధమైంది. బోర్లు, బావుల ఆధారంగా వ్యవసాయం చేసుకునే రైతులు ఇప్పటికే నారుమడులు పోసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో నారుమడుల కోసం పొలం మడి సిద్ధం చేస్తున్నారు. వానకాలంలో సీజన్లో రైతులు ఏరకం పంటలు, ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలి? ఎలాంటి విత్తనాలు నాటాలి ?
ఎరువులు, పురుగు మందులు వాడాల్సిన మోతాదు ఎంత?, దుక్కులు ఎలా సిద్ధం చేసుకోవాలి? ఎన్ని వానలు కురిసిన తర్వాత విత్తనాలు నాటాలి? వంటి మెళకువలపై వ్యవసాయశాఖలో కొత్తగా నియామకమైన ఏఈవోలు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుండడంతో గతంలో కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. గతంలో వ్యవసాయశాఖ అధికారుల సంఖ్య తక్కువగా ఉండి ఒక్కొక్కరు రెండు, మూడు మండలాలకు ఇన్చార్జీలుగా వ్యవహరించడంతో క్షేత్రస్థాయిలో రైతులకు సరైన సలహాలు, సూచనలు అందలేదు. దీంతో రైతులు ఇష్టానుసారంగా పంటలు సాగుచేసి విచ్చలవిడిగా ఎరువులు, పురుగు మందులు వాడి నష్టపోయారు. పంట రకాలు, విత్తనాలపై అవగాహన లేక బోగస్ కంపెనీల ప్రచారంతో కొందరు రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోయిన ఘటనలు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో వ్యవసాయశాఖలో వినూత్న మార్పులు చోటుచేసుకున్న ఫలితంగా జిల్లా, డివిజన్ స్థాయి అధికారుల పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పర్యటనలు, సమావేశాలతో వ్యవసాయంలో అధికారుల పాత్ర పెరిగింది. రైతులు ఎలాంటి పంటలు సాగుచేస్తే దిగుబడి వస్తుందనే అంశంలో వేసవిలోనే మట్టి నమూనాలను సేకరించి భూసార వివరాలను కంప్యూటరణ వంటి పరిణామాలు మేలు చేయనున్నాయి. నీటి లభ్యత ఉన్న ప్రాంతాలు, భూములు, బోర్లు, బావుల కింద సాగయ్యే పంటలపై వ్యవసాయ అధికారుల నేతృత్వంలో సమగ్ర సర్వే కొనసాగుతున్నది.
3,76,625 లక్షల ఎకారాల్లో సాగు
జిల్లాలో 2023-24 సంవత్సరానికి వానకాలం 3,76,625 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 1.90 లక్షల ఎకరాల్లో వరి, 1.70 లక్షల ఎకరాల్లో పత్తి, 11 వేల ఎకరాల్లో కందులు, 4 వేల ఎకరాల్లో మక్కజొన్న, 250 ఎకరాల్లో వేరుశనగ, 125 ఎకరాల్లో నువ్వు పంట, 150 ఎకరాల్లో మినుము, 1100 ఎకరాల్లో పెసరు పంటలు సాగవుతాయని చెబుతున్నారు. వానకాలం సీజన్లో రైతులకు అవసరమైన వివిధ రకాల విత్తనాలు సహా పత్తి విత్తన ప్యాకెట్లు, ఎరువులు సిద్ధం చేశారు. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 68 క్లస్టర్లుగా వ్యవసాయశాఖ అధికారులు వానకాలం పంటసాగు ప్రణాళికను ప్రభుత్వానికి నివేదించారు. గత వానకాలంలో జిల్లాలో అన్ని పంటలు కలిపి 3,73,301 ఎకరాల్లో సాగు అంచనా వేయగా, అందులో వరి అంచనా విస్తీర్ణం 1,13,300 ఎకరాలు. అయితే ఇందులో రైతులు 1,90,126 ఎకరాల్లో నాట్లు వేశారు. 2 లక్షల ఎకరాల్లో పత్తి సాగతుందని అంచనా వేసినా 1,44,617 ఎకరాల్లో మాత్రమే వేశారు. ఈ యాసంగిలో 1,20,685 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణంగా అధికారులు అంచనా వేసినా జిల్లాలో 2,03,899 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. అంటే జిల్లాలో గత ఏడాది వ్యవసాయ శాఖ అధికారుల అంచనాలకు మించి 76,826 ఎకరాల్లో వరి సాగైంది.
సరిపడా ఎరువులు..
జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా పత్తి సాగు చేస్తుండగా, తర్వాత వరి, మక్కజొన్న సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. వానకాలం సీజన్లో జిల్లా రైతాంగానికి అన్ని పంటలకు కలిపి మొత్తం 1,11,077 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. అందులో యూరియా 47,258 మెట్రిక్ టన్నులు, డీఏపీ 17,200 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 27,555 మెట్రిక్ టన్నులు, పొటాష్ 15,670 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 2,752 మెట్రిక్ టన్నులు, జింక్ 642 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం పడుతాయని అధికారులు చెబుతున్నారు.
అందుబాటులో విత్తనాలు, ఎరువులు
ఈ వానకాలం సీజన్లో రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాం. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా సాగు పనులు చేపట్టండి. అయితే పూర్తిస్థాయిలో వర్షాలు కురవక ముందే రైతులు తొందరపాటుగా విత్తనాలు నాటి నష్టపోవద్దు. వ్యవసాయ పనులకు ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కొద్దిరోజుల్లో రైతుబంధు సాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. కొత్తగా పట్టాదార్ పాసుపుస్తకం వచ్చిన రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పేర్లను ఆన్లైన్లో నమోదు చేశాం.
-వినోద్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి