వరంగల్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హనుమకొండ జిల్లాలో ఈ సంవత్సరం 5800 ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలు సాగు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇందుకు సరిపడా మొక్కల పెంపకం కోసం వరంగల్ సెంట్రల్ జైలులోని 21 ఎకరాల్లో నర్సరీని జైళ్ల శాఖ నిర్వహిస్తున్నది. 2.7 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండగా, ఇప్పటికే పంపిణీ ప్రక్రియ కూడా మొదలైంది. నాణ్యమైన మొక్కలతో రైతులకు మేలు జరుగడంతో పాటు నర్సరీ నిర్వహణతో ఖైదీలకు ఆదాయం సమకూరుతున్నది. జైలు అధికారులు ఎప్పటికప్పుడు ప్రిజనర్ పర్సనల్ క్యాష్(పీపీపీ)లో డబ్బులు జమ చేస్తున్నారు.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్పామ్ తోటల కోసం సరిపడా మొక్కల పెంపకం జరుగుతున్నది. తోటల పెంపకంలో కీలకమైన నాణ్యమైన మొక్కలకు వరంగల్ సెంట్రల్ జైలు కేంద్రంగా మారింది. పామాయిల్ మొక్కల నర్సరీ నిర్వహణపై జైళ్ల శాఖ ప్రత్యేకత శ్రద్ధ చూపుతున్నది. జైలులోని ఖైదీలకు ఉపాధి మార్గాన్ని చూపించడం, రైతులకు మొక్కలు అందించడమే లక్ష్యంగా జైళ్ల శాఖ పామాయిల్ నర్సరీని నిర్వహిస్తున్నది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ ఏడాది జైలులో రైతులకు పామాయిల్ మొక్కల పంపిణీ ప్రక్రియ మొదలైంది. నర్సరీలో మొత్తం మూడు లక్షల మొక్కల పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు 2.7లక్షల మొక్కలు అందుబాటులోకి వచ్చాయి. హనుమకొండ జిల్లాలో 2021-22 సంవత్సరంలో 5,800 ఎకరాల్లో పామాయిల్ మొక్కలను సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కాగా, నర్సరీకి అవసరమైన స్థలాలు ఎక్కడా దొరకలేదు. దీంతో సెంట్రల్ జైల్లో మొక్కలు పెంచేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో రైతులకు అవసరమైన పామాయిల్ మొక్కలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి.
నగరంలోని సెంట్రల్ జైలును కూల్చి వేసి ప్రభుత్వం రాష్ట్రంలోనే అతి పెద్ద ఆస్పత్రిని నిర్మిస్తున్నది. సెంట్రల్ జైలును మామునూరు బెటాలియన్కు తరలించింది. ఇక్కడ సెంట్రల్ జైలు కోసం 101 ఎకరాలను కేటాయించింది. కొత్తగా జైలు భవనాలను నిర్మించే వరకు ఇక్కడి ఖైదీలను ఇతర జిల్లాలకు తరలించారు. సాధారణ శిక్షలు అనుభవిస్తున్న కొందరు ఖైదీలు మామునూరులోని తాత్కాలిక జైలులోనే ఉంటున్నారు. వరంగల్ నగరం, శివారు ప్రాంతాల్లో జైళ్ల శాఖ నిర్వహిస్తున్న పెట్రోలు బంకుల్లో వీరు పనులు చేసుకుంటున్నారు. సెంట్రల్ జైల్ను తరలించిన తర్వాత ఇక్కడ ఉండే ఖైదీలకు నిత్యం పని కల్పించేందుకు జైళ్ల శాఖ కొత్త ప్రతిపాదనలు రూపొందించింది. హనుమకొండ జిల్లాలో కొత్తగా పామాయిల్ సాగు చేసే రైతుల కోసం ఈ మొక్కల నర్సరీని నిర్వహించేందుక జైళ్ల శాఖ అంగీకరించింది. పామాయిల్ నర్సరీ నిర్వహణ కోసం అవసరమైన ఏర్పాట్లు, ఇతర సాంకేతిక అవగాహన కోసం ఇక్కడి అధికారుల బృందం ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ప్రాంతానికి రెండు సార్లు వెళ్లి వచ్చింది. సమగ్ర అధ్యయనం అనంతరం జైలులో నర్సరీ నిర్వహణను మొదలుపెట్టింది. రైతులకు ఈ ఏడాది ఇవ్వాల్సిన మొక్కలను సిద్ధం చేసింది. ఇప్పుడు మొక్కల పంపణీ కూడా మొదలైంది.
35 మంది ఖైదీలతో మొదలు..
జైలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 101 ఎకరాల్లోని 21 ఎకరాలను పామాయిల్ నర్సరీ కోసం వినియోగిస్తున్నారు. దీనిలోనూ ప్రైమరీ నర్సరీ కోసం ఎకరంలో షేడ్ నెట్ను అమర్చారు. పామాయిల్ నర్సరీలో మొదట 35 మంది ఖైదీలతో పని చేయించేందుకు జైళ్ల శాఖ అనుమతి ఇచ్చింది. వీరంతా నర్సరీ నిర్వహణ మొదలుపెట్టారు. విచారణ, కోర్టుల తీర్పులు, బెయిలు వంటి ప్రక్రియలో పామాయిల్ నర్సరీ బాధ్యతలు నిర్వహించే వారిలో పది మంది బయటికి వెళ్లారు. ప్రస్తు తం 25 మంది పని చేస్తున్నారు. నర్సరీలో పని చేసే ఖైదీలకు కూలి కింద ఇచ్చే మొత్తాన్ని ప్రిజనర్ పర్సనల్ క్యాష్(పీపీపీ)లో జమ చేస్తున్నారు. దీంతో ఖైదీలకూ కొంత ఆదాయం సమకూరుతున్నది.
ఖైదీలకు మంచి ఉపాధి లభించింది..
సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల ఉపాధి కోసం వృత్తి నైపుణ్యం ఉన్న పనులు చేయిస్తాం. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో మొదలు పెట్టిన ఆయిల్పామ్ సాగుకు నర్సరీని నిర్వహించే అవకాశం జైళ్ల శాఖకు వచ్చింది. ఈ అవకాశాన్ని ఖైదీలు చక్కగా వినియోగించుకుంటున్నారు. నర్సరీ నిర్వహణతో రైతులకు సకాలంలో నాణ్యమైన మొక్కలు అందుతున్నాయి. పామాయిల్ మొక్కల పెంపకంలో ఖైదీల పాత్ర కీలకంగా ఉన్నది.
– మందారపు సంపత్, డీఐజీ, జైళ్ల శాఖ
మొక్కల సమస్య తీరింది..
ఆయిల్ పామ్ పంటను సాగు చేసేందుకు రైతులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యం మేరకు జైళ్ల శాఖ సమన్వయంతో నర్సరీ అందుబాటులోకి వచ్చింది. జైలులోని నర్సరీ వల్ల రైతులకు మొక్కల కొరత ఉండదు. ప్రతి ఏడాది మొక్కల పెంపకం లక్ష్యం పూర్తవుతుంది.
– శ్రీనివాసరావు, ఉద్యాన శాఖ జిల్లా అధికారి, హనుమకొండ