ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ఇప్పుడు నిరంతర విద్యుత్తో ప్రగతిపథంలో దూసుకుపోతోంది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన 24 కరంట్ వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఉమ్మడి జిల్లాలో కోతల్లేని సరఫరాతో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. పవర్ హాలి డేలకు స్వస్తి పలకడంతో పరిశ్రమల్లో ఉత్పత్తి పెరిగి కార్మికులకు చేతినిండా పని దొరికింది. గతంలో ఉపాధి దొరకక మనవాళ్లు వలసపోయే దుస్థితి ఉండేది. కానీ సీఎం కేసీఆర్ దార్శనికతతో ఆ పరిస్థితి మారి ఉత్తరాది రాష్ర్టాల నుంచి వేలాదిగా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఐదేళ్లలో ఎన్పీడీసీఎల్ రికార్డు స్థాయిలో 1.78 లక్షల కొత్త కనెక్షన్లు ఇచ్చింది. 197 కొత్త సబ్స్టేషన్ల నిర్మా ణం చేపట్టి, 48, 602 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసింది. 175 పవర్ ట్రాన్స్ఫార్మర్లు బిగించి,44 సబ్స్టేషన్లు నిర్మించి నిరంతర వెలుగులు అందిస్తున్నది. ఈమేరకు విద్యుత్ శాఖ అందిస్తున్న సేవల నేపథ్యంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు విద్యుత్ విజయోత్సవం నిర్వహించనుండగా ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
– హనుమకొండ సబర్బన్, జూన్4
హనుమకొండ సబర్బన్, జూన్ 4: తెలంగాణ రాక వ్యవసాయానికి కేవలం 4 లేదా 6 గంటలే విద్యుత్ సరఫరా చేసేవారు. కూడా పగలు, రాత్రి కొంత సేపు ఇచ్చేవారు. రాత్రి పూట వ్యవసాయబావుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు, పాము కాట్లకు గురై అనేక మంది ప్రాణాలు విడిచారు. 2018జనవరి ఒకటి అర్ధరాత్రి నుంచి వ్యవసాయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నది. ఇదేకాకుండా గృహ అవసరాలు, పరిశ్రమలకు కూడా నిరంతరంగా విద్యుత్ అందిస్తున్నది. దీని కోసం సర్కారు మహత్తర శ్రమ పడింది. ఈ విద్యుత్ విజయానికి అనేక మార్పులు చేయాల్సి వచ్చింది.
ఎన్పీడీసీఎల్ పరిధిలో భారీ మార్పులు
ఎన్పీడీసీఎల్ పరిధిలో ఐదేళ్లలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. 1,281 (33/11) విద్యుత్ సబ్స్టేషన్లు మాత్రమే గతంలో ఉండగా, ఐదేళ్లలోనే మరో 197 కొత్తవి నిర్మించారు. 1,561 కిలోమీటర్ల 33కిలోవాట్లు, 12వేల 653 కిలోమీటర్ల మేర 11 కిలోవాట్ల విద్యుత్ లైన్లను అమర్చారు. 47,841 కిలోమీటర్ల లోటెన్షన్(ఎల్టీ) విద్యుత్ లైన్ వేశారు. ఐదేళ్లలో పాత లైన్తో పోల్చితే 36శాతం పెరుగుదల ఉంది. 745 కిలోమీటర్ల 63 కిలోవాట్ విద్యుత్ లైన్, 48,402 విద్యుత్ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు, 175 పవర్ ట్రాన్స్ఫార్మర్లను బిగించారు. సోలార్ ఎనర్జీని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. సిబ్బంది కొరత లేకుండా సంస్థలో 3,414 ఖాళీలకు 3,133 మందిని అన్ని స్థాయిల్లో నియమించారు. 2018 కంటే ముందు కేవలం 27 లక్షల ఎకరాల సాగు భూమి మాత్రమే ఉండేది. కేవలం ఐదేండ్లలోనే సాగు భూమి కాస్తా 94 లక్షలకు చేరింది.
ఉమ్మడి జిల్లాలో గణనీయ అభివృద్ధి
2018 కంటే ముందు 46,213 ట్రాన్స్ఫార్మర్లు ఉండేవి. ఇప్పుడు అవి 65,615కు చేరుకున్నాయి. 29 పవర్ ట్రాన్స్ఫార్మర్లు గతంలో ఉంటే ఇప్పుడు 76 ఉన్నాయి. అంతకుముందు కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే నానా ఇబ్బందులు అయ్యేవి. ఇప్పుడు రైతు మీసేవలో దరఖాస్తు చేసుకోగానే కొత్త కనెక్షన్ మంజూరు చేస్తున్నారు. ఇప్పుడు నాయీబ్రాహ్మణులు, లాండ్రీషాపులకు, ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగానే విద్యుత్ ఇస్తున్నారు. 24 గంటలపాటు నిరంతరంగా అన్ని కేటగిరీ కనెక్షన్లకు విద్యుత్ ఇస్తున్నారు.
చీకట్లను పారదోలాం
చీకట్లో మగ్గుతున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో వెలుగులు నిండాయి. సీఎం ముందుచూపు వల్లే ఇది సాకారమైంది. వేల కోట్ల రూపాయలు వెచ్చించి కొత్తగా సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. దీని వల్ల వ్యవసాయ రంగం గణనీయమైన అభివృద్ధి చెంది గతంలో కంటే లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి పెరిగినట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. నిరంతర విద్యుత్ను సరఫరా చేయడం వల్ల ఇతర రాష్ర్టాలు, దేశాల నుంచి పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. సామాజిక సేవలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్లు, లాండ్రీ షాపులు, సెలూన్లకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. ఈ పదేండ్ల కాలంలో రాష్ట్రం అభివృద్ధి చెందడంతో విద్యుత్ పాత్ర ఎంతో గొప్పది.
– అన్నమనేని గోపాల్ రావు, సీఎండీ, ఎన్పీడీసీఎల్