హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 14 : కాకతీయ యూనివర్సిటీ (కేయూ)ని ప్రక్షాళన చేస్తానని ప్రగాల్భాలు పలికిన సీఎం రేవంత్రెడ్డి ఆ దిశగా అడుగులు వేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేయూ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ముగ్గురు మంత్రులు వచ్చి హడావుడి చేశారు. 2024 మార్చి 10న వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో పాటు కొండా సురేఖ, సీతక్క ఎంతో ఆర్భాటంగా కే-హబ్ను ప్రారంభించారు. రెండేండ్లు గడిచినా ఇప్పటికీ ఉపయోగంలోకి తీసుకురాకపోవడంతో అది అలంకార ప్రాయంగా మారింది. దీంతో విద్యావేత్తలు, మేధావులు, పరిశోధకులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న కేయూలో విద్యార్థులను పరిశోధనల వైపు మళ్లించేందుకు నిర్మించిన కే-హబ్ లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు.
రూ.50 కోట్లు కేటాయింపు..
రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రుసా) కింద కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల కిందట కే-హబ్ను మంజూరు చేసిం ది. పరిశోధనలకు అనువుగా బిల్డింగ్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్ డెవలప్మెంట్, ఇతర అన్ని రకాల వసతులు కల్పించేందుకు రూ.50 కోట్లు కేటాయించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2020లోనే పనులు ప్రారంభించినప్పటికీ కరోనా కారణంగా 2021లో నిర్మాణం మొదలై 2024 మార్చిలో పూర్తయ్యింది. హైదరాబాద్లోని టీ-హబ్తో కాకతీయ యూనివర్సిటీ ఒప్పందం చేసుకోగా, కే-హబ్ డైరెక్టర్గా సవితాజ్యోత్స్న, జాయింట్ డైరెక్టర్లుగా కాంట్రాక్టు అధ్యాపకులు బొల్లం కిరణ్, సిద్ధార్థను వీసీ ప్రొఫెసర్ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వల్లూరి రాంచంద్రం నియమించారు. తమిళనాడులోని మధురై యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయూబ్ అలీని కే-హబ్ ఇన్చార్జి హెచ్వోడీగా నియమించారు. అప్పట్లో వీరి నియామకంపై దుమారం లేపింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కేయూ ఈసీ మెంబర్ చిర్ర రాజు ఫైరవీతో పోస్టును నింపినట్లు ఆరోపణలు వినిపించాయి.
అన్నీ ఉన్నా..
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఉంది కే-హబ్ పరిస్థితి. రుసా రూ. 50 కోట్లు విడుదల చేయగా అందులో మొదటి దశలో రూ. 6 కోట్లతో బిల్డింగ్ నిర్మించారు. ఆ తర్వాత రూ. 9 కోట్లతో మౌలిక వసతులు కల్పించడంతో పాటు రూ. 23 కోట్లతో ఇన్స్ట్రుమెంటేషన్, డ్రగ్ రీసెర్చ్, మాలిక్యూల్స్ అండ్ మెటీరియల్ ఫిజిక్స్, నానో డ్రగ్ డెలివరీ సిస్టమ్స్, ఇథ్నో మెడిసినల్ ప్లాంట్స్ తదితర రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. వాటితో పాటు మిగతా రూ. 12 కోట్లను పరిశోధన ప్రాజెక్టుల కోసం వెచ్చించాల్సి ఉండగా.. నిధులున్నా వర్సిటీ అధికారుల పట్టింపులేనితనంతో నిరూపయోగంగా మారింది. కే-హబ్ వినియోగంలోకి వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఫార్మాస్యుటికల్ సైన్స్, జియోలాజికల్ సైన్స్ తదితర రంగాల్లో పరిశోధనలకు అవకాశం ఉంది.
రెన్నోవేషన్ జరుగుతుంది..
కే-హబ్ లోపల రెన్నోవేషన్ జరుగుతున్నది. ఇప్పటికే టీ-హబ్ను సందర్శించాం. అక్కడి ప్రతినిధులు కూడా కే-హబ్ను సందర్శించారు. ఇటీవల కేయూ ఆడిటోరియంలో నూతన ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్పై సదస్సు నిర్వహించాం. కే-హబ్ యాప్ ద్వారా 1,200 మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. విద్యార్థుల మైండ్సెట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి త్వరలో పరీక్ష నిర్వహిస్తాం.
– సవితాజ్యోత్స్న, కే-హబ్ డైరెక్టర్
నెలరోజుల్లో అందుబాటులోకి..
హైదరాబాద్లోని టీ-హబ్తో ఒప్పందం కుదిరింది. కే-హబ్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లను కూడా నియమించాం. లోపల కొన్ని పనులు జరుగుతున్నాయి. అవి పూర్తిగానే నెలరోజుల్లో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తాం. విద్యార్థుల నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు ఆమోదం పొందేందుకు, వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కృషిచేస్తాం.
– ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రం, కేయూ రిజిస్ట్రార్