వర్ధన్నపేట, ఫిబ్రవరి 7: ప్రభుత్వం క్రీడా రంగానికి ప్రాధాన్యమిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఈనెల 17వ తేదీన సీఎం కేసీఆర్ బర్త్ డేను పురస్కరించుకొని వర్ధన్నపేటలో అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ (ఏజీఎఫ్) ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి కేపీఎల్ (కేసీఆర్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ పోటీలను మంగళవారం ప్రారంభించారు. ఏజీఎఫ్ సీఈవో రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పోటీలను ప్రారంభించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ జన్మదినం వరకు నియోజకవర్గ స్థాయి పోటీలను పూర్తిచేసుకొని ఫైనల్ మ్యాచ్ ఆడించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విజేత జట్టుకు రూ. ఒక లక్షా 116, రన్నరప్ జట్టుకు రూ.50,116 నగదు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. అందుకోసం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు 120జట్లు పాల్గొంటున్నాయని వివరించారు.
నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ఏజీఎఫ్ ద్వారా ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించినట్లు చెప్పారు. మొదటి దశలో శిక్షణ పొందిన 226 మంది పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఉద్యోగాలు పొందారని, రెండో దశ శిక్షణ పొంది ఉద్యోగాల కోసం 630 మంది ఎంపికైనట్లు తెలిపారు. అంతేకాక మహిళలు, యువతీ, యువకులకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. సంక్రాంతి ముగ్గుల పోటీలను కూడా నిర్వహించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం బిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ, వైస్చైర్మన్ కోమాండ్ల ఎలేందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, మాజీ జడ్పీటీసీ సారంగపాణి, ఆత్మ చైర్మన్ గోపాల్రావు, బీఆర్ఎస్ నాయకులు తుమ్మల యాకయ్య, సిలువేరు కుమారస్వామి, రహీమ్, పులి శ్రీనివాస్, పూజారి రఘు, సుంకరి సాంబయ్య, గొడిశాల శ్రీనివాస్, మైస రాము పాల్గొన్నారు.