బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది
రాబోయే రోజుల్లో బీజేపీ నాయకులను ప్రజలు తరిమి కొడతారు
సీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు
కృష్ణకాలనీ, జూన్ 17 : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అగ్నిపథ్ను రద్దు చేయాలని సీపీఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా జిల్లా కేంద్రంలో సీపీఎం నాయకులు ప్ల కార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఆర్మీ సైనిక వ్యవస్థలో అగ్నిపథ్ విధానాన్ని అమలు చేయాలని చూడడం సరికాదన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో కార్మికులను తీసుకున్నట్టుగా సైనికులను నియమించడం సరికాదన్నారు. దేశం కోసం, దేశ భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించే వారికి ఈ విధానంతో అన్యాయం జరుగుతుందన్నారు. నాలుగేళ్ల తర్వాత రిటైర్డ్ సైనికులకు రూ.11లక్షలు ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. రిటైర్ అయిన తర్వాత ఏ పని చేసుకొని బతుకుతాడని ప్రశ్నించారు. వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ పోరాడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు పొలం రాజేందర్, రాజన్న, రమేశ్, కిరణ్, శ్రీకాంత్, వినయ్, మహేందర్, మల్లన్న పాల్గొన్నారు.
కాటారంలో..
సికింద్రాబాద్లో కొనసాగుతున్న హింసాకాండకు కేంద్ర ప్రభుత్వమే కారణమనీ, దేశంలో అగ్గి రాజేస్తున్న అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాలని తుడుందెబ్బ నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం నిరసన చేపట్టారు. యువతను నిరుద్యోగులుగా మార్చే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కేంద్రానికి తగదన్నారు. కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సమ్మయ్య, మాల భేరి రాష్ట్రకన్వీనర్ పీక కిరణ్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు మండే కుమార్, నాయకులు బోడ రాజు, శ్రావణ్, నరేశ్ పాల్గొన్నారు.