మహబూబాబాద్, మార్చి 26 : దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ తయారు చేసిన కీలుబొమ్మని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ అన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణపై వివక్ష చూపుతున్నారని విమర్శించారు. సీపీఐ ప్రజాపోరు యాత్ర ఆదివారం మహబూబాబాద్లోని బంధం చెరువు నుంచి స్థానిక ముత్యాలమ్మ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో నారాయణ పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేలో కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన యూనివర్సిటీల ఏర్పాటులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. మతోన్మాదంతో గుజరాత్లో మారణహోమం సృష్టించిన మోదీ ప్రధాని కావడం దురదృష్టకరమన్నారు.
అత్యాచారం కేసులో నిందితుడైన అమిత్షా కేంద్రంలో హోంశాఖ మంత్రిగా ఉండడం ఎంతవరకు సమంజసమన్నారు. బయ్యారం గుట్టల్లో నాణ్యమైన ఉక్కు ఉన్నా పరిశ్రమ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుంటే అమరుడైన సీపీఐ నేత కాళీదాస్ ప్రధాని మోదీని దయ్యమై పట్టుకుంటాడని, జైలుకు వెళ్లినా బెయిల్ దొరకదని ఎద్దేవా చేశారు. మహబూబాబాద్ మైన్స్, మినరల్స్ ఉన్న ప్రాంతమని, ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ భావాలున్న వ్యక్తులనే రాష్ర్టాలకు గవర్నర్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంపిస్తున్నదని నారాయణ విమర్శించారు. దేశంలో మొత్తం 89 మంది బ్యాంకు రుణాలు ఎగవేస్తే అందులో విజయ్మాల్యా తప్ప మిగిలిన వారంతా గుజరాత్కు చెందిన వారేనని నారాయణ తెలిపారు. దేశంలో ఎన్నో కుంభకోణాలకు కారణమైన ఆదానీని అరెస్ట్ చేయకపోవడం బీజేపీ నేతలకున్న సంబంధాన్ని గుర్తు చేస్తుందన్నారు.
ఆర్ఎస్ఎస్ విధానాలతోనే కేరళ, తమిళనాడులో ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేసిందని దుయ్యబట్టారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆదానీతో డ్రగ్స్ను కేంద్ర ప్రభు త్వం దిగుమతి చేయిస్తున్నదని ఆరోపించారు. కేంద్రంలో మంత్రి పదవులు అనుభవిస్తున్న 24 మంది పలు నేరాల్లో నిందితులన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తున్న బీజేపీని ప్రజాకోర్టులో క్షేత్రస్థాయిలో ఓడిస్తామని ఆయన స్పష్టం చేశారు. మతోన్మాద శక్తులపై సీపీఐ అలుపెరగని పోరాటం చేస్తుందని, ఈ విషయంలో సీఎం కేసీఆర్తో కలిసి నడుస్తామని అన్నారు. జిల్లా కార్యదర్శి విజయ్సారథిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు చెందిన ఎంపీలు బండి సంజయ్, అరవింద్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి దమ్ముంటే బీజేపీ పెద్దలతో కొట్లాడి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రజాపోరుయాత్ర కన్వీనర్ తక్కళ్లపల్లి శ్రీనివాస్రావు, జనగామ, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా ల కార్యదర్శులు సీహెచ్ రాజిరెడ్డి, మేకల రవి, కర్రె భిక్షపతి, కొరిమి రాజ్కుమార్, తోట మల్లికార్జున్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ జ్యోతి, పంజాల రమేశ్, విశ్వేర్రావు, సుధాకర్రెడ్డి, శ్రీనివాస్, పాండురంగాచారి, పెరుగుకుమార్, రేషపల్లి నవీన్, వెంకన్న, సాంబలక్ష్మి, సందీప్, లింగ్యా, శ్రావణ్, ఫాతిమా, రామ్మూర్తి, రవి, శ్రావణ్, వేణు, రమేశ్, చిరంజీవి, మహమూద్, రామునాయక్, రవీందర్, తోట రాజకుమారి విజయ్ పాల్గొన్నారు.