వరంగల్ ప్రతినిధి : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అక్రమ ఇసుక రవాణాను నియత్రించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పోలీస్ కమిషనర్ కమిషనరేట్ పరిధిలో ఇసుక తరలించే వాగులను ఆకస్మికంగా సందర్శిస్తున్నారు. బుధవారం సీపీ కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబాల -నేరెళ్ల వాగును సందర్శించారు.
ఇసుకను అక్రమంగా తరలించే మార్గాలపై ఇన్స్పెక్టర్ హరికృష్ను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా అక్రమంగా ఇసుక తరలించే వారి సమాచారాన్ని అందుబాటులో వుంచుకోవడంతో పాటు వారి కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని సీపీ అధికారులను ఆదేశించారు.
చెక్ పోస్ట్ తనిఖీ..
కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబాల శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఇసుక చెక్ పోస్ట్ను అంబర్ కిషోర్ ఝా తనిఖీ చేశారు. తనిఖీలు జరిపే సమయంలో సిబ్బంది తప్పనిసరిగా వాహన వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇసుక తరలించే వాహనాలకు అనుమతి పత్రాలు ఉన్నాయో కూడా తప్పనిసరిగా పరిశీలించాలని, నిరంతరం ఇసుక రవాణా వాహనాలపై నిఘా పెట్టాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.