ములుగు, మార్చి10(నమస్తేతెలంగాణ): ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు, మంత్రి సీతక్క అనుచరుడు బానోత్ రవిచందర్ ప్లాట్ ఇప్పిస్తానని మోసం చేశాడని దంపతులు ఆత్మహత్యా యత్నం చేసుకున్న ఘటన ములుగు మండలం జీవంతరావుపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడు నిగ్గుల సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. 2013లో ములుగు జిల్లా కేంద్రంలోని సమ్మయ్యనగర్ కాలనీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి బానోత్ సమ్మయ్య ప్లాట్లు చేశాడని, అందులో ఒక ప్లాట్ ఇప్పిస్తానని రూ. లక్షా80వేలు తీసుకొని కాగితం కూడా రాసి ఇచ్చాడు. అప్పటి నుంచి మాయమాటలు చెబుతూ 9 ఏళ్ల పాటు తిప్పించుకోవడమే కాకుండా సీతక్క తాను కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామని చెప్పి, ఆ ప్లాట్ను ఎక్కువ రేటుకు విక్రయించి చింతలపల్లిలో భూమి కొనుగోలు చేసి కోట్లు సంపాదించాడు. ఆ తర్వాత ప్లాట్కు బదులుగా భూమి ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదు. దీంతో చేసేదేమీ లేక తన భార్య శారదతో కలిసి నిగ్గుల సుధాకర్ గ్రామంలోని తమ ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటామని పెట్రోల్ బాటిల్ పట్టుకుని తలుపులు మూసుకున్నారు.
విషయం తెలుసుకున్న ములుగు ఎస్సై-2 రామకృష్ణ అక్కడికి వెళ్లి కిటికీలో నుంచి సుధాకర్ను సముదాయించే ప్రయత్నం చేయగా రవిచందర్ మంత్రి సీతక్క పేరు చెప్పి భూమి విషయంలో తనను మోసం చేశాడని చెప్పాడు. తమ సమస్య సీతక్క దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే వరకు తాము ఇంట్లో నుంచి బయటకు రామని, లేదంటే నిప్పంటించుకొని చనిపోతామని ఎస్సైకి తేల్చి చెప్పారు. దీంతో ఎస్సై మంత్రి సీతక్క అధికారిక కార్యక్రమంలో బిజీగా ఉన్నారని తెలిపి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్కు ఫోన్ ద్వారా విషయాన్ని తెలియజేశారు. స్పందించిన అశోక్ సుధాకర్తో ఫోన్లో మాట్లాడారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని, ఆత్మహత్య లాంటివి ఏమి చేయవద్దని చెప్పాడు. అశోక్ హామీతో సుధాకర్, అతని భార్య శారద ఆత్మహత్యా యత్నాన్ని విరమించుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. కాగా, ఎస్సై వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. సొంత గ్రామానికి చెందిన తననే ఈ విధంగా మోసం చేసిన రవిచందర్ ఇంకా చాలా మందిని మోసం చేసి ఉంటాడని, తన చావుతోనైనా అతడి నిజస్వరూపం బయటకు వస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.