పోచమ్మమైదాన్, మే 22 : వరంగల్ జిల్లాలోని చేనేత సంఘాల్లో నిల్వ ఉన్న కార్పెట్లు, బెడ్ షీట్ల కొనుగోళ్లు షురువయ్యాయి. ‘సంఘాల్లో పేరుకుపోయిన నేత ఉత్పత్తుల నిల్వలు’ శీర్షికన ఈనెల 2న ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నేత ఉత్పత్తుల కొనుగోళ్లకు మార్గం సుగమం చేశారు. ఈ నేపథ్యంలో తూర్పు నియోజకవర్గంలో చేనేత సహకార సంఘాలు తయారు చేసిన రూ.10కోట్ల విలువైన ఉత్పత్తుల ఖరీదును టెస్కో ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కార్పెట్లు, బెడ్షీట్లపై స్టాంపింగ్ చేసి, కొనుగోళ్లను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. కొత్తవాడలోని చేనేత సహకార సంఘంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రూ.10కోట్లతోపాటు మరో రూ.4కోట్ల చేనేత ఉత్పత్తులను ఖరీదు చేయించేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
సంఘాలు, కార్మికులు ఇబ్బందులు పడకుండా ప్రతి మూడు నెలలకోసారి ఖరీదు చేసి, డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. విదేశీ పర్యటన నుంచి రాగానే మంత్రి కేటీఆర్ను కలిసి వరంగల్ చేనేత కార్మికుల సమస్యలను తెలియజేస్తానని పేర్కొన్నారు. సంఘా ల్లో ఉన్న 1200 మంది చేనేత బీమాకు ఎంపికయ్యారని, వీరికి మూడు రోజుల్లో బీమాపత్రాలు వివరించారు. బాల సంఘం వద్ద ఉన్న ఓ కార్పెట్లు, బెడ్షీట్లకు స్టాంపింగ్ వేశారు. మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి, కార్పొరేటర్ కావటి కవిత, నాయకులు యెలగం సత్యనారాయణ, పలు సంఘాల పర్సన్ ఇన్చార్జిలు కొలిపాక మదనయ్య, పంతగాని శ్రీనివాస్, యెలుగం చిన కొమురయ్య, వెంకటమల్లు, శ్రీనివాస్, చిన్న భద్రయ్య, రాజేందర్, కూరపాటి సంపత్, యెలుగం సాంబయ్య, యెలగం ఓం ప్రకాశ్, రమేశ్, సారయ్య, రాజమౌళి, మల్లేశం పాల్గొన్నారు.
‘కార్యకర్తలను కాపాడుకునేది బీఆర్ఎస్ పార్టీయే’
కరీమాబాద్: కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునేది బీఆర్ఎస్ పార్టీ అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం 27వ డివిజన్లోని ముందడా భవనంలో కార్పొరేటర్ చింతాకుల అనిల్ అధ్యక్షతన డివిజన్లోని ముఖ్య నాయకులు, ఆత్మీయ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పార్టీని మరింత బలపేతం కోసం పనిచేయాలన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరిపాలన ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలను తప్పదారి పట్టించేలా ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టాలన్నారు. ప్రభుత్వ సహకారంతో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
‘అన్నపూర్ణగా మారిన తెలంగాణ’
పోచమ్మమైదాన్: సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్నపూర్ణగా మారిందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శివనగర్లోని సాయి కన్వెన్షన్ హాల్లో వ్యవసాయం, పోలీస్ టాస్క్ఫోర్స్, విజిలెన్స్ ఆధ్వర్యంలో విత్తన, పురుగు మందుల విక్రయదారులతో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రైతుల బాగు కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సాగునీరు అందిస్తున్నారని తెలిపారు. ఈక్రమంలో రైతులు బాగుంటేనే వారిపై ఆధారపడిన ఫర్టిలైజర్స్, సీడ్స్ వ్యాపారులు లాభపడుతారని తెలిపారు. వ్యాపారులు నకిలీ విత్తనాలు విక్రయించొద్దని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. తెలంగాణ రైతు రుణ విముక్తి కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, అధికారులు, అసోసియేషన్ల ప్రతినిధులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.