ఖిలావరంగల్, జనవరి 06 : ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఫోర్ట్ వరంగల్ పరిధిలోని 35వ డివిజన్ శివనగర్ బ్యాంకు కాలనీలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి మంగళవారం ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, వరంగల్ డివిజన్ విద్యుత్ శాఖ డీఈ శెంకేసి మల్లికార్జున్ మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
లో ఓల్టేజ్ సమస్యలు, లూస్ వైర్లు, విద్యుత్ సరఫరాలో అంతరాయం, బిల్లులు ఎక్కువగా లేదా తక్కువగా రావడం, ట్రాన్స్ఫార్మర్లలో లోపాలు, కరెంట్ వైర్లపై ఉన్న చెట్ల కొమ్మలు, ఇండ్లపై నుంచి వెళ్తున్న 11 కేవీ లైన్లు, రహదారికి అడ్డంగా ఉన్న విద్యుత్ స్థంభాల సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజా బాట వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్, విద్యుత్ ఏడీ కిషోర్ కుమార్, ఏఈ రామకృష్ణ, రాజయ్య, లైన్ ఇన్స్పెక్టర్ సాంబరాజు, లైన్మెన్లు శ్రీధర్, నాగరాజు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.