హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 8: రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న 1270 మంది ఒప్పంద అధ్యాపకులను రాష్ట్ర ప్రభుత్వం భేషరతుగా పర్మినెంట్ చేయాలని, జీవో 21 వెంటనే రద్దు చేసి తమకు న్యాయం చేయాలని కాంట్రాక్టు అధ్యాపకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త విశ్వవిద్యాలయ అధ్యాపకుల సంఘం పిలుపుమేరకు మంగళవారం అధ్యాపకులు తరగతులను బహిష్కరించి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆందోళన చేపట్టారు.
కేయూ పరిపాలన భవనం ఎదుట బైఠాయించి వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకుల సంఘం రాష్ర్ట నాయకులు డాక్టర్ కర్ణాకర్రావు, డాక్టర్ శ్రీధర్ లోథ్కుమార్, డాక్టర్ కనకయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని గతంలో అనేకసార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీమేరకు అందరిని రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే దిశగా తగు చర్యలు చేపట్టాలని లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం కేయూ ఉపకులపతి కర్నాటి ప్రతాపరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కేయూ ఒప్పంద అధ్యాపకులు సాధు రాజేష్, సతీష్, వీణ, ఆశీర్వాదం, అంజన్నరావు, గడ్డం కృష్ణ, ఆర్డి ప్రసాద్, కే.మధుకర్రావు, భిక్షపతి, లక్ష్మారెడ్డి, సునీత, సుజాత, సంగీత్, కుమార్, బ్లెస్సీ, ప్రియాంక, శ్రీలత, సుచరితపాల్, సత్యజూల, సదాశివ, నాగేశ్వరరావు, తూర్పాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.