నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం
ఉప్పొంగుతున్న వాగులు, అలుగు దుంకుతున్న చెరువులు
పలు గ్రామాలకు స్తంభించిన రాకపోకలు
మారుమూల గ్రామాలకు నిలిచిన ఆర్టీసీ బస్సులు
పునరావాసం పొందుతున్న వందలాది మంది
సింగరేణి గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
మత్తడి పోస్తున్న లక్నవరం సరస్సు..
27.6 అడుగులకు చేరిన రామప్ప
తగ్గుతున్న గోదావరి ఉధృతి
ములుగు జిల్లాలో ఒకేరోజు రికార్డు స్థాయిలో 10.97 సెంటీమీటర్లు
వెంకటాపురం(నూగూరు)లో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3.26 సెంటీమీటర్లు
జిల్లాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షం కురుస్తూనే ఉంది. సోమవారం రాత్రి విరామం ఇచ్చినప్పటికీ మంగళవారం ఉదయం నుంచి వాన జోరు కొనసాగింది. దీంతో ప్రజలు ఎవరూ బయటకు రాలేకపోయారు. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండి అలుగు పోస్తున్నాయి. వరదలతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు. పునరావాస కేంద్రాల్లో వందలాది మందికి అధికారులు వసతులు కల్పించారు. కలెక్టర్లు అధికారులందరినీ అలర్ట్ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక సేవలు అందిస్తున్నాయి. మంగళవారం ఉదయం వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3.26 సెంటీమీటర్లు, ములుగు జిల్లాలో 7.06 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పది గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో ఒకేరోజు రికార్డు స్థాయిలో 10.97 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. గోదావరి నది కాళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తూ మేడిగడ్డ వద్ద లక్ష్మీ బరాజ్కు వరద పెరుగుతోంది.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు (నమస్తే తెలంగాణ), జూలై 12: జిల్లాల్లో నాలుగో రోజూ ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మంగళవారం రోజంతా భారీ కురుస్తూనే ఉంది. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. భూపాలపల్లిలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీగా వరద నీరు చేరగా బొగ్గు ఉత్పత్తి నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాల్లో లోతట్టు గ్రామాలకు చెందిన 800 మందికి పునరావాసం కల్పించారు. జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్ 5 ఇంక్లెయిన్ కమాన్ ప్రధాన జాతీయ రహదారిపై వరదనీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగడంతో మున్సిపల్ రెస్యూ టీం రంగంలోకి దిగి జేసీబీతో నీటిని తొలగించా రు. చిట్యాల మండలం అందుకుతండా, వెంచరామి గ్రామాల మధ్య మోరంచవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కాటారం మండలంలో బొప్పారం వాగు ఉప్పొంగుతూనే ఉంది. మహాముత్తారం మండలంలో పోలీస్స్టేషన్ వాగు వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.
భూపాలపల్లి మండలం రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని వజినేపల్లిలో ఏడు ఇళ్ల గోడలు కూలిపోయాయి. భూపాలపల్లి ఏరియాలో కేటీకే ఓసీపీ-2, కేటీకే ఓసీపీ-3 గనుల్లో బొగ్గు ఉత్పత్తి, మట్టి తొలగింపు నిలిచింది. మల్హర్మండలం ఏఎంఆర్ ఓపెన్ కాస్ట్లోనూ బొగ్గు ఉత్పత్తి ఆగింది. పలిమెల మండలం పెద్దంపేట బ్రిడ్జి వద్ద అప్రోచ్ రోడ్డు తెగి రాకపోకలు స్తంభించాయి. లెంకలగడ్డ గ్రామానికి చెందిన చెన్నూరి రజిత అనే గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో అక్కడే ఉన్న ఎన్డీఆర్ఎఫ్ రెస్యూ టీమ్ వాగు దాటించారు. ప్రత్యేక వాహనంలో సూరారం వరకు చేరవేసి, అకడి నుంచి అంబులెన్స్లో భూపాలపల్లి దవాఖానకు తరలించారు. పెద్దంపేట వద్ద ధ్వంసమైన బ్రిడ్జి వద్ద తాత్కాలికంగా అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. వర్షాల నేపథ్యంలో హనుమకొండ, కాళేశ్వరం, మంచిర్యాల, గోదావరిఖని మినహా దారులు సక్రమంగా లేని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నిలిపివేసినట్లు భూపాలపల్లి డిపో మేనేజర్ తెలిపారు. దీంతో ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మేడిగడ్డ వద్ద వరద రాక పెరుగుతోంది.
చిట్యాల: అందుకుతండా, వెంచరామి గ్రామాల నడుమ మోరంచవాగు పొంగడంతో రాకపోకలు నిలిపివేసినట్లు ఫ్లెక్సీ చూపుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
కాటారం: ఉధృతంగా ప్రవహిస్తున్న బొప్పారం వాగు
ములుగు జిల్లాలో…
ములుగు జిల్లాలో మంగళవారం రోజంతా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోవిందరావుపేట మండలం బుస్సాపురంలోని లక్నవరం సరస్సు 33.5 అడుగుల పూర్తిగా నిండి మంగళవారం ఉదయం నుంచి 2 ఫీట్ల ఎత్తుతో మత్తడి పోస్తోంది. మండలం జాకారం, బండారుపల్లి, లోకంచెరువులు మత్తళ్లు పోస్తూ రామప్ప సరస్సులోకి చేరుతుండగా మంగళవారం సాయంత్రం వరకు రామప్ప సరస్సు నీటిమట్టం 27.6 అడుగులకు చేరింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వెంకటాపురం(నూగూరు) మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పక్కనున్న వాజేడు, ఏటూరునాగారం మండలాల్లో 6.3, మంగపేట మండలంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గోదావరి నదికి వరద ఉధృతి తగ్గింది. మంగపేట, ఏటూరునాగారం మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను అధికారులు కొనసాగిస్తున్నారు. గోదావరి వరద ఉధృతి 14లక్షల క్యూసెక్కుల నీటితో ప్రవహిస్తున్నందున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అధికారులను అప్రమత్తం చేశారు.
ములుగులో 10.97 సెంటీమీటర్లు..
జిల్లాలోని తొమ్మిది మండలాల్లో మంగళవారం ఉదయం నుంచి సాయం త్రం 6 గంటల వరకు 10.97 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వెంకటాపురం(నూగూరు)లో 16.22, వాజేడులో 12.54, వెంకటాపూర్లో 11.40, మంగపేటలో 10.66, ఏటూరునాగారంలో 10.30, ములుగులో 9.76, గోవిందరావుపేటలో 9.24, తాడ్వాయిలో 7.68, సెంటీ మీటర్లు నమోదైనట్లు వివరించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3.26..
జిల్లాలో మంగళవారం ఉద యం 8 గంటల వరకు 3.26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మహాదేవ్పూర్, పలిమెల మండలాల్లో 5.9 సెంటీమీటర్లు, చిట్యాల, టేకుమట్ల మండలాల్లో 1.3, మల్హర్రావులో 2.18, మహాముత్తారంలో 8.68, కాటారంలో 3.06, గణపురంలో 2.58, భూపాలపల్లిలో 2.3, మొగుళ్లపల్లిలో 0.92, రేగొండలో 1.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వివరించారు.