శాయంపేట, మే 7: హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని కొప్పుల శివారు చలివాగుపై హైలెవల్ వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 365 మీటర్ల పొడవుతో హైలెవల్ వంతెనను నిర్మించడంతో దశాబ్దాల కల నెరవేరిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో మండలంలోని కొప్పుల, రేగొండ మండలానికి చెందిన గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. లోలెవల్ వంతెన వల్ల ఏటా వర్షాకాలంలో చలివాగు వరద నీటితో ఎన్నో గ్రామాల ప్రజలు పడిన వ్యయప్రయాసాలకు చెక్ పడింది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 7 కోట్లతో చేపట్టిన హైలెవల్ వంతెన పూర్తి కావడంతో ప్రజల్లో ఆనందాన్ని నింపింది. మండలకేంద్రం నుంచి సుమారు పది కిలో మీటర్ల దూరంలో కొప్పుల గ్రామం ఉంది. కొప్పుల శివారులో చలివాగు జలాశయం ఉంది.
చలివాగు ప్రాజెక్టు నిండితే ఆ ప్రవాహం లోలెవల్ వంతెన పైనుంచి వెళ్తుంది. కొప్పులతోపాటు రేగొండ మండలంలోని గోరికొత్తపల్లి, నిజాంపల్లి, సుల్తాన్పూర్, వెంకటేశ్వర్లపల్లి, చిన్నకోడెపాక, బాలయ్యపల్లి, కోనరావుపేట, కొత్తపల్లి, ములుగు మండలంలోని అబ్బాపూర్ తదితర గ్రామాల వాహనదారులు ఈ రోడ్డు మార్గం ద్వారా పట్టణాలకు వెళ్తుంటారు. కొప్పుల నుంచి వాహనదారులు శాయంపేట, హనుమకొండ, వరంగల్కు వెళ్లాలన్నా ఈ లోలెవల్ వంతెన పైనుంచే వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో వర్షాకాలంలో చలివాగు ప్రాజెక్టు నిండి భారీ నీటి ప్రవాహం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రాకపోకలు స్తంభించిపోయేవి. ఏదైనా పని కోసం మండలకేంద్రానికి వెళ్లే కొప్పుల గ్రామస్తులు చెన్నాపూర్, రూపురెడ్డిపల్లి నుంచి పరకాలకు.. అక్కడి నుంచి మాందారిపేటకు వచ్చి శాయంపేట చేరుకునే వారు. లేదా వసంతాపూర్, ప్రగతిసింగారం, పత్తిపాక నుంచి వచ్చే వారు. దీంతో వ్యయప్రయాసాలకు గురయ్యేవారు. ఈ నేపథ్యంలో కొప్పుల శివారులో హైలెవల్ వంతెన నిర్మాణం ప్రతిపాదన దశాబ్దాలుగా ఉంది.
పట్టించుకోని గత పాలకులు
అప్పటి పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. 2018లో సీఎం కేసీఆర్ ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి హైలెవల్ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 7 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో 155 మీటర్ల బ్రిడ్జి, అప్రోచ్ 210 మీటర్లు కలిపి మొత్తం 365 మీటర్ల బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం బ్రిడ్జి పైనుంచి రాకపోకలు సాగుతుండడంతో గ్రామస్తులు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శాయంపేట, రేగొండ మండలాల్లోని సుమారు 30 గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మెరుగైన రవాణా సౌకర్యం
కొప్పుల శివారులో హైలెవల్ వంతెన నిర్మాణం పూర్తి కావడం ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఈ ప్రాంత పరిధిలోని 30 గ్రామాలకు రవాణా మెరుగుపడింది. గతంలో కొప్పుల ప్రజలు హనుమకొండకు వెళ్లడం ఇబ్బందిగా ఉండేది. వర్షాకాలంలో రవాణా సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు వంతెన నిర్మాణం పూర్తయినందున అధికారులు హనుమకొండ నుంచి ఆర్టీసీ బస్సులు నడపాలి. హనుమకొండ నుంచి వయా గూడెప్పాడ్, మాందారిపేట, శాయంపేట, మైలారం, జోగంపల్లి, కొప్పుల మీదుగా గోరికొత్తపల్లి వరకు ఆర్టీసీ బస్సు నడిపిస్తే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. బస్సులు వస్తే విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుంది. ఆర్టీసీ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలి.
– గోలి మాధురీ మహేందర్రెడ్డి, కొప్పుల సర్పంచ్