వర్ధన్నపేట, మార్చి 15 : స్వరాష్ట్రంలో జిల్లా ప్రగతి పరుగులు పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ చేయూతతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. గీసుగొండ మండలం శాయంపేట, సంగెం మండలం చింతలపల్లి గ్రామాల పరిధిలో 1,200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న మెగాటెక్స్టైల్ పార్కు ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా మారుతోంది. వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో రూ.1100 కోట్లతో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆజంజాహి మిల్లు స్థలంలో సమీకృత కలెక్టరేట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మన ఊరు- మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించారు. మిషన్ కాకతీయతో పునరుద్ధరించిన చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. పల్లె, పట్టణ ప్రగతితో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారాయి. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టుల నీళ్లతో రైతులు ఏటా రెండు పంటలు పండిస్తున్నారు.
స్వరాష్ట్రంలో వరంగల్ జిల్లా ప్రగతి పథంలో పయనిస్తున్నది. జిల్లాల పునర్విభజనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2016లో వరంగల్ రూరల్ జిల్లాను ఏర్పాటు చేసింది. కానీ, పరిపాలనా సౌలభ్యం కోసం నిపుణుల సూచనల మేరకు 2021 ఆగస్టులో వరంగల్ జిల్లాగా ప్రకటించింది. 2014 ముందు సాగునీరులేక ఎడారిగా పంట భూములు కనిపించేవి. గ్రామాల్లోని చెరువులు చుక్క నీరు లేక బోసిపోయేవి. కట్టలు, తూములు శిథిలావస్థకు చేరుకోవడంతో మిషన్ కాకతీయతో ప్రభుత్వం చెరువులను పూరిస్థాయిలో మరమ్మతులు చేసింది. సమృద్ధిగా నీరు లభిస్తుండడంతో వానకాలం, యాసంగి పంటలను సాగు చేసుకుంటున్నారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుతో 365 రోజులు చెరువుల్లో నీరు నిల్వ ఉంటోంది. మిషన్ భగీరథతో స్వచ్ఛమైన జలాలను ప్రతి ఇంటికి సరఫరా చేస్తుండడంతో తాగునీటి ఇబ్బందులు లేవు. దీనికి తోడు మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రం, గ్రామాల నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్లు వేయడంతో జిల్లాలో రవాణా వ్యవస్థ ఎంతో మెరుగైంది.
‘మన ఊరు-మన బడి’తో పాఠశాలలకు మహర్దశ
విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నది. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో పాఠశాలలకు మహర్దశ పట్టనుంది. ఈ కార్యక్రమంలో జిల్లాలో 223 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే మొదటి విడుత విద్యాశాఖ 83 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నది. వీటికి తోడుగా జిల్లాలో గురుకుల పాఠశాలలను కూడా పెద్ద సంఖ్యలో నెలకొల్పడంతో పేద కుటుంబాల విద్యార్థులకు మెరుగైన విద్య లభిస్తున్నది.
రూ.83 కోట్లతో వ్యర్థ జలాల శుద్ధి కేంద్రం..
మెగా టెక్స్టైల్ పార్కులో వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఇటీవల రూ.85 కోట్లను విడుదల చేస్తున్నట్లు జీవోను జారీ చేసింది. దీంతో టీఎస్ఐఐసీ ఉన్నతాధికారులు కర్మాగారాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టెక్స్టైల్ పార్కులో భారీ పరిశ్రమలు పూర్తిస్థాయిలో ప్రారంభమైతే పెద్ద ఎత్తున వ్యర్థాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ముందస్తుగానే ఆలోచించి వ్యర్థ జలాల శుద్ధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది.
గిడ్డంగుల నిర్మాణానికి రూ.39 కోట్లు ..
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం గిడ్డంగుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ధరలు లేనిసమయంలో రైతులు వారి ఉత్పత్తులను గిడ్డంగుల్లో నిల్వ చేసుకొని ప్రభుత్వం నుంచి రుణాన్ని కూడా పొందవచ్చు. జిల్లాలో సుమారు 45వేల టన్నుల సామర్థ్యం కలిగిన గిడ్డంగులను నిర్మించేందుకు రూ.39 కోట్లను మంజూరు చేసింది. ఇప్పటికే జిల్లాలో సుమారు 20వేల టన్నుల సామర్థ్యం కలిగిన గిడ్డంగుల నిర్మాణం పూర్తికాగా మిగిలిన చోట్ల కూడా పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఒక్కో గిడ్డంగిని 5 ఎకరాల స్థలంలో నిర్మిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, జిల్లాలోని 77 హెల్త్ సబ్సెంటర్ల పక్కా భవనాల నిర్మాణం కోసం రూ.13.64 కోట్లను ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసింది.
కలెక్టరేట్కు గ్రీన్సిగ్నల్ ..
వరంగల్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవన నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ వచ్చింది. ఆజంజాహీ మిల్లు స్థలానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోయాయి. దీంతో ప్రభుత్వం త్వరలోనే ఈ స్థలంలో అన్ని వసతులు కలిగిన కలెక్టరేట్ను నిర్మించనుంది. అలాగే, జిల్లా కేంద్రంలోని బీటుబజార్, బట్టలబజార్లో వై ఫ్లైఓవర్, చింతల్ బ్రిడ్జిల నిర్మాణం కూడా జరుగడంతో సమీకృత కార్యాలయాల భవనానికి చేరుకోవడంతో సులువుగా ఉంటుంది.
హెల్త్హబ్గా వరంగల్ ..
జిల్లా కేంద్రంలోని సెంట్రల్ జైలు స్థలంలో సుమారు రూ.1100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ఏడాది జూన్లో సీఎం కేసీఆర్ ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇంజినీరింగ్శాఖ అధికారులు భవన నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వం 2వేల పడకల సామర్థ్యం, 24 అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నది. కార్పొరేట్కు దీటుగా ఈ ఆస్పత్రిలో వైద్య సేవలు అందనున్నాయి. ఆస్పత్రి వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకే కాకుండా కరీంనగర్, ఖమ్మం జిల్లాల ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉండనున్నది. ఈ ఏడాది అక్టోబర్ వరకు దవాఖానను ప్రారంభించేందుకు అధికారులు శరవేగంగా పనులు చేపడుతున్నారు. ఆస్పత్రి నిర్మాణం పూర్తయి సేవలు ప్రారంభమైతే వరంగల్ హెల్త్హబ్గా మారనుంది.
టెక్స్టైల్ పార్కు లో పరిశ్రమలు..
గీసుగొండ మండలం శాయంపేట, సంగెం మండలం చింతలపల్లి గ్రామాల పరిధిలో సుమారు 1,200 ఎకరాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెగాటెక్స్టైల్ పార్కు ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా మారుతున్నది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన అనేక పరిశ్రమలు ఈటెక్స్టైల్ పార్కులో ఏర్పాటవుతున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఇప్పటికే గణేశా ఎకోటెక్, ఎకోపెట్ పరిశ్రమలకు సంబంధించిన పలు ప్లాంట్లను మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రారంభించారు. అలాగే, కిటెక్స్ కంపెనీ కూడా త్వరలోనే తన ఉత్పత్తులను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. టెక్స్టైల్ పార్కులోని పరిశ్రమలకు తగిన విధంగా నీటి వసతిని కల్పించేందుకు ప్రభుత్వం రూ.100 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో శాయంపేట మండలంలోని జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు నుంచి ప్రత్యేకంగా పైపులైన్ వేయిస్తున్నది. టెక్స్టైల్ పార్కులోని పరిశ్రమలకు 24 గంటల పాటు విద్యుత్ అందించేందుకు సుమారు రూ.100 కోట్లతో 225కేవీ సామర్థ్యం కలిగిన విద్యుత్ సబ్స్టేషన్ను కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
దేవాదుల, కాళేశ్వరంతో జిల్లా సస్యశ్యామలం ..
సాగునీరు సమృద్ధిగా అందుతుండడంతో రైతులు సంతోషంగా పంటలను సాగు చేసుకుంటున్నారు. గతంలో కేవలం లక్ష ఎకరాలు కూడా మించని పంటల సాగు ప్రస్తుత యాసంగిలో 2,21,368 ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేసుకుంటున్నారు. వానకాలం, యాసంగిలో జిల్లాలో రైతులు గణనీయంగా పంటల ఉత్పత్తులు చేపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులు నిత్యం నీటితో కళకళలాడుతున్నాయి. దేవాదుల మూడో దశలో భాగంగా రామప్ప బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నల్లబెల్లి మండల పరిధిలోని రంగాయచెరువు వరకు ఎత్తిపోతల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు పైపులైన్ వేయించింది. దీంతో రెండేళ్లుగా రంగాయచెరువు కింద ఉన్న సుమారు 60 గ్రామాలకు నీరు అందుతున్నది. దీనికి తోడు రామప్ప-పాకాల ఎత్తిపోతల పథకం పనులను కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. త్వరలోనే పాకాల చెరువుకు గోదావరి జలాలు అందనున్నాయి. మిషన్ కాకతీయ ద్వారా జిల్లాలో సుమారు 450 చెరువుల వరకు పూరిస్థాయిలో ప్రభుత్వం మరమ్మతులు చేయించింది. 2014కు ముందు ఎస్సారెస్పీ కాల్వలో ఏడాదిలో నెల రోజులు కూడా నీరు వచ్చే పరిస్థితి ఉండేదికాదు. కానీ, ప్రస్తుతం వేసవిలో కూడా కాల్వలో నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది.
పల్లె ప్రగతితో మారిన ముఖచిత్రం
ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాల ముఖచిత్రాలు మారిపోయాయి. గ్రామాల్లో ప్రకృతి వనాలు, డంపింగ్యార్డులు, శ్మశానవాటికల నిర్మాణాలు చేపట్టింది. అంతేకాక గ్రామాలలో అంతర్గత సీసీరోడ్ల నిర్మాణం కూడా చేపట్టడంతో ప్రజలకు మౌలిక వసతులు మెరుగయ్యాయి. దీనికితోడుగా గ్రామాలను పచ్చగా మార్చడం కోసం నర్సరీలను ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో మొక్కలను పెంచుతున్నది. వర్షాకాలం ప్రారంభంకాగానే మొక్కలు నాటనున్నారు. అలాగే, పట్టణాల్లో కూడా పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుతో రాష్ట్రంలోనే వరంగల్ జిల్లా అభివృద్ధిలో ముందు ఉండనున్నది. దీనికి తోడుగా జిల్లా కేంద్రం కూడా పారిశ్రామికంగా, వ్యవసాయంలో కూడా ఎంతో ప్రగతి సాధిస్తున్నది. దీంతో రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రగతిలో వరంగల్ జిల్లా ప్రధాన భూమిక పోషించనుంది.