హనుమకొండ, డిసెంబర్ 20 : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకే బీఆర్ఎస్ పాలనపై బురద చల్లుతోందని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. బుధవారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతల వ్యవహారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంత్రి కొండా సురేఖ వరంగల్ సెంట్రల్ జైలును కూల్చారని ప్రస్తావించారని, కానీ అది శిథిలావస్థలో ఉన్నట్లు గతంలోనే గుర్తించారన్నారు. రూ. 1100 కోట్లతో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ దవాఖానపై ఆమె హేళనగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో ఎంజీఎం దవాఖాన ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది. దీనిపై చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ విద్య, వైద్య రంగానికి పెద్ద పీట వేశారని, ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేశారని, పల్లె, బస్తీ దవఖానలు ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. మహిలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు బస్సుల్లో ఉచిన ప్రయాణం కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే గిరాకీ లేక రోడ్డున పడుతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, నాయకుడు పులి రజినీకాంత్ పాల్గొన్నారు.