నర్సంపేట డయాగ్నస్టిక్స్ హబ్గా మారనుంది. పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతన టెక్నాలజీతో తెలంగాణ డయాగ్నస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్ను ఏర్పాటు చేసింది. రూ.1.20 కోట్లతో నిర్మించిన ఈ సెంటర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. జిల్లాలోని పీహెచ్సీ, సీహెచ్సీల్లో రోగుల నుంచి సేకరించిన రక్త, మల, మూత్ర నమూనాలను ఇకపై ఇక్కడే పరీక్షంచనున్నారు. ఫలితాలు ఆన్లైన్లో సంబంధిత రోగులకు అందనున్నాయి. ఇప్పటికే సెంటర్కు కావాల్సిన అన్ని పరికరాలను రూ. కోటి వెచ్చించి సమకూర్చారు. సిబ్బందిని కూడా నియమించారు.
– నర్సంపేట, మే 13
నర్సంపేట, మే 13 : పట్టణంలో త్వరలో అందుబాటులోకి రానున్న తెలంగాణ డయాగ్నస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్లో 140 రోగాలకు సంబంధించిన పరీక్షలను చేయనున్నారు. బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ విభాగాలకు చెందిన ల్యాబ్లను ఏర్పాటు చేశారు. వీటిలో థైరాయిడ్, హోర్మోన్లు, యూరిక్ ఆసిడ్, లివర్ ఫంక్షన్ టెస్ట్లు, గుండెకు సంబంధించిన జబ్బులు, లిఫిడ్ప్రొఫైల్, కొలస్ట్రాల్, షుగల్, ప్లేట్లెట్స్ పరీక్షలు చేస్తారు. రేడియాలజీ విభాగంలోనూ టిఫా స్కానింగ్, ఎక్స్రే, అల్ట్రా సౌండ్, టూడీ ఎకో లాంటి పరీక్షలు ఇందులో చేయనున్నారు.
గతంలో ఈ పరీక్షలు ఎంజీఎం లాంటి దవాఖానలోనే అందుబాటులో ఉండేవి. కొందరు అంతదూరం వెళ్లలేక స్థానికంగా ఉన్న ప్రైవేట్ దవాఖానలకు వెళ్లడం, ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యేవారు. దీన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో డయాగ్నస్టిక్ హబ్ను నిర్మించింది. వరంగల్ జిల్లాలో నర్సంపేటలోనే ఈ హబ్ను నిర్మాణం పూర్తయింది. రూ.1.20 కోట్లతో ప్రత్యేకంగా రెండంతస్తుల భవనం నిర్మించారు. మరో రూ.కోటితో పరికరాలను తెప్పించారు. ప్రస్తుతం పరికరాల ఇన్స్టాలేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. త్వరలోనే దీన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.
జిల్లాలోని అన్ని దవాఖానలకు..
జిల్లాలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నర్సంపేట, వర్ధన్నపేట సీహెచ్సీకి వచ్చే రోగుల నుంచి శాంపిల్స్ను అక్కడి ల్యాబ్ అసిస్టెంట్లు సేకరిస్తారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రూట్ను ఏర్పాటు చేసి రోజూ వాహనాల ద్వారా నర్సంపేటకు నమూనాలను పంపిస్తారు. ల్యాబ్లో వాటిని పరీక్షించి రోగుల ఆధార్కార్డు, సెల్ఫోన్ నంబర్లు, బార్కోడ్లను వేసి పంపుతారు. బార్కోడ్ల ఆధారంగా ఫలితాలను రోగుల సెల్ఫోన్కు పంపిస్తారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఇద్దరు రేడియాలజిస్ట్లను నియమించారు. ల్యాబ్ మేనేజర్, రెడియోగ్రాఫర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, పాథాలజీ సిబ్బందిని నియమించారు.
సకాలంలో రోగ నిర్ధారణ..
జిల్లాలోని అన్ని దవాఖానల నుంచి వచ్చిన రోగుల రక్త నమూనాలను ఇక్కడే పరీక్షిస్తాం. సకాలంలో రోగికి వైద్య సహాయం అందించడం వల్ల స్వస్థత చేకూరే అవకాశం ఉంటుంది. పరీక్షల ఫలితాలను ఆన్లైన్లో పొందపర్చడంతో పాటు రోగుల సెల్ ఫోన్కు మెసేజ్ పంపిస్తాం. నర్సంపేటలో నిర్మించిన తెలంగాణ డయాగ్నస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే అన్ని మిషనరీలను బిగించాం.
– డాక్టర్ గోపాల్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్, నర్సంపేట