వరంగల్, జూలై 4 : తూర్పు నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్యలతో కలిసి ఆయన అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష చేశారు. అభివృద్ధి పనుల వారీగా ఆయాశాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల జాప్యంపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటానని నియోజకవర్గంలో చేపట్టిన స్మార్ట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. కొన్ని పూర్తి కావస్తున్నాయని, మరికొన్ని పనులు జాప్యమవుతున్నాయని, అధికారులు ప్రత్యేకంగా పూర్తి చేయాలని చెప్పారు. ఉర్సుగుట్ట నుంచి భద్రకాళీ బండ్ వరకు వరద కాలువ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. రోడ్ల వెడల్పు, జంక్షన్ల అభివృద్ది పనులను వేగంగా చేపట్టాలని అన్నారు. పలు డివిజన్లలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వాటిని పరిష్కరించాలని అయన అధికారులను అదేశించారు. డివిజన్లలో విధ్యుత్ స్థంబాల సమస్యపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. రోడ్ల నిర్మాణాలు చేస్తున్న ప్రాంతాల్లో పైపులైన్ పనులను విస్మరిస్తున్నారని అన్నారు. దీంతో భవిష్యత్లో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. దీనిపై అధికారులు దృష్టిసారించాలన్నారు. ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేసిన అభివృద్ధి పనులను త్వరగా మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. అధికారులు కార్పొరేటర్లను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.
బస్స్టేషన్ నిర్మాణ పనులను త్వరగా చేపట్టాలి
రూ.75కోట్లతో కొత్తగా వరంగల్లో నిర్మించనున్న అధునాతన బస్స్టేషన్ పనులను వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధికారులను ఆదేశించారు. తొలుత ప్రస్తుత బస్ స్టేషన్ కూల్చివేత పనులను ప్రారంభించాలన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా తాత్కాలిక బస్స్టేషన్ను త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కొత్తగా నిర్మించనున్న కలెక్టరేట్ ముందు డ్రైనేజీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సూచించారు.
బీసీ రుణాలు, గృహలక్ష్మిలో పారదర్శకత ఉండాలి
బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, గృహలక్ష్మి పథకంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధికారులను ఆదేశించారు. గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు చేసుకొనే వారికి కార్పొరేటర్లు సహకరించాలన్నారు. 57 ఏళ్ల వయసు గల వారు పింఛన్కు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇప్పటికే చాలా దరకాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించాలన్నారు. డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, కార్పొరేటర్లు, రోడ్లు, రహదారులు, రెవెన్యూ, విద్యుత్, బల్దియా బీసీ వెల్ఫేర్ శాఖల అధికారులు పాల్గొన్నారు.