మహబూబాబాద్, ఆగస్టు 24 : ఈ నెల 28న కానిస్టేబుల్ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహిస్తామని ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మినీ నందన గార్డెన్లో కానిస్టేబుల్ రాత పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కానిస్టేబుల్ రాత పరీక్ష కోసం జిల్లాలో 33 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ బోర్డు నియమావళి ప్రకారం జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 10,190 మంది స్త్రీ, పురుష అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని వివరించారు. 33 కేంద్రాల వద్ద నోడల్ అధికారి అడిషనల్ ఎస్పీ యోగేశ్ గౌతమ్, అసిస్టెంట్ నోడల్ అధికారి ఏఆర్ డీఎస్పీ సదానందం, చీఫ్ కో ఆర్డినేటర్ మరిపెడ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చీఫ్ సూపరింటెండెంట్లు, 36 మంది అబ్జర్వర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. కానిస్టేబుల్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందన్నారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి లభించదని స్పష్టం చేశారు.
నలుగురి అరెస్టు
నెల్లికుదురు, ఆగస్టు 24 : యూరియాను మత్తు పదార్థమని మోసం చేస్తూ అమ్మడానికి ప్రయత్నిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై పీ జితేందర్ తెలిపారు. మండలంలోని పార్వతమ్మగూడెం బస్ సేటజీ వద్ద ఈ నెల 23న పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో నెల్లూరు జిల్లా గూడూరు మండలం తోటపల్లి గ్రామానికి చెందిన పోలు ప్రసాద్, ఒంగోలు జిల్లా దొరవారితోట గ్రామానికి చెందిన కొల్లం సునీల్, నెల్లూరు జిల్లా కొవ్వూరు పట్టణానికి చెందిన శంకరం రాము, ఎస్కే అబిద్ యూరియాను మత్తు పదార్థమని చెప్పి అమ్మడానికి యత్నిస్తున్నారు. ఆ నలుగురిని ఏఎస్సై వెంకన్న, సిబ్బంది చంద్రారెడ్డి, వెంకన్న పట్టుకుని వారి వద్ద నుంచి యూరియాను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. వీరిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.