రవాణా సౌకర్యం బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం రహదారుల విస్తరణపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి మోకాలడ్డుతున్నా, ఇక్కడి ప్రగతి పనులపై ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తూ నిధులు మంజూరు చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టుసడలని సంకల్పంతో ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా వరంగల్ నగరంలోని నేషనల్ హైవేలపై కొత్తగా రెండు ఆర్వోబీలు నిర్మిస్తున్నది. పూర్తిగా సొంత నిధులు రూ. 128 కోట్లతో కాజీపేటలో ఒకటి, హంటర్ రోడ్డులోని విమ్స్ కాలేజీ వద్ద మరో బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతుండగా, మరో రెండు, మూడు నెలల్లో వినియోగంలోకి రానున్నాయి.
వరంగల్, మే 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభు త్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. గ్రామాల నుంచి మండలాలు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు ఉన్న రోడ్ల విస్తరణ, మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేస్తున్నది. ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన బ్రిడ్జిలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తున్నది. వరంగల్ మహానగరం నుంచి హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాలకు వెళ్లే జాతీయ రహదారుల్లో ఏ చిన్న అడ్డంకులు లేకుండా చేస్తున్నది. వరంగల్ నుంచి కాజీపేట వరకు ఉన్న రైల్వే ట్రాకులపై రెండు చోట్ల బ్రిడ్జిలను నిర్మిస్తున్నది. కాజీపేట, హంటర్ రోడ్డులోని విమ్స్ కాలేజీ వద్ద వీటి నిర్మాణం వేగంగా జరుగుతున్నది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఈ రెండు బ్రిడ్జిలు పూర్తవుతున్నాయి. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై కాజీపేట వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి ఉన్నది. పెరిగిన వాహనాల సంఖ్య, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఈ బ్రిడ్జిని విస్తరించాల్సి ఉన్నది. కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో ఇక్కడ కొత్తగా బ్రిడ్జిని నిర్మిస్తున్నది. వరంగల్-ఖమ్మం-విజయవాడ జాతీయ రహదారిపై హంటర్ రోడ్డులోని విమ్స్ కాలేజీ సమీపంలో రైల్వే బ్రిడ్జి ఉన్నది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఇక్కడా కొత్త బ్రిడ్జిని నిర్మించాలని కోరితే కేంద్రం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడా మరో బ్రిడ్జిని నిర్మిస్తున్నది. పనులకు అనుకూలమైన సీజన్ కావడంతో రెండు బ్రిడ్జిల పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో ఈ పనులు పూర్తి చేయాలని ఇటీవల వరంగల్ పర్యటనకు వచ్చిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. వానకాలంలోపు పూర్తయ్యేలా పనులు జరుగుతున్నాయి.
కాజీపేట, హంటర్ రోడ్డు రైల్వే ఓవర్ బ్రడ్జిలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తున్నది. తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ రెండు బ్రిడ్జిలకు ఒక్క పైసా ఇవ్వలేదు. పైగా రైల్వే స్థలంలో బ్రిడ్జిలను నిర్మిస్తున్నందుకు శాశ్వత లీజు కింద ఒక్కో బ్రిడ్జికి రూ.10 కోట్లు తమకు చెల్లించాలని రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రజల అవసరాల కోసం బ్రిడ్జి నిర్మిస్తుంటే ఇలాంటి అడ్డంకులు సృష్టించడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా సమాధానం చెప్పడంతో ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో పనులకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత రెండు బ్రిడ్జిల పనులు వేగంగా జరుగుతున్నాయి. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై కాజీపేట వద్ద 1974లో బ్రిడ్జి నిర్మించారు. 20 ఏండ్ల క్రితం హంటర్రోడ్డు ఆర్వోబీని నిర్మించారు. రెండు జాతీయ రహదారులపై వాహనాల రద్దీ బాగా పెరిగింది. పాత ఆర్వోబీలకు సమాంతరంగా రెండు చోట్ల అదనంగా ఆర్వోబీలను నిర్మించాలని 2017లో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.78 కోట్లతో కాజీపేట వద్ద, రూ.50 కోట్ల తో హంటర్ రోడ్డులో ఆర్వోబీలను మొదలుపెట్టింది. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. రైల్వే శాఖ సాకులతో పనులు నెమ్మదిగా జరిగాయి. 6 నెలల నుంచి పనుల్లో వేగం పుంజుకున్నది.