వెంకటాపూర్, జనవరి 30 : త్వరలో రామప్ప ఉప ఆలయాల పునరుద్ధరణ పనులు చేపడుతామని రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ భారతీ హోలీకేరి అన్నారు. మంగళవారం ఆమె రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పూజారులు హరీశ్శర్మ, ఉమాశంకర్ స్వాగతం పలికి రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ మండపంలో శాలువాతో సత్కరించి ఆశీర్వచనం అందజేశారు.
అనంతరం రామప్ప చెరువు వద్ద త్రికూటాలయం, శివాలయం, కల్యాణ మండపం, భైరవగుడి, హెలిప్యాడ్ వద్ద ఆలయం, జాకారం శివాలయాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. ఉప ఆలయాల పునర్నిర్మాణం పరిశీలన కోసం వచ్చినట్లు భారతీ హోలీకేరి తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అన్నారు. ఆమె వెంట డిప్యూటీ డైరెక్టర్ బీ నారాయణ, అసిస్టెంట్ డైరెక్టర్లు మల్లు నాయక్, నర్సింగ్ నాయక్, పురావస్తు, టూరిజం, దేవాదాయ శాఖల సిబ్బంది ఉన్నారు.