దేవరుప్పుల, మార్చి 23 : పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండల కాంగ్రెస్లో గ్రూపుల పోరు రచ్చకెక్కింది. పార్టీ మండల అధ్యక్ష పదవి నుంచి పెద్ది కృష్ణమూర్తిని తొలగించడంతో శ్రేణుల్లో అగ్గి రాజుకుంది. నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ రెండు గ్రూపులుగా విడిపోయింది. మండల అధ్యక్ష పదవి నుంచి పెద్ది కృష్ణమూర్తిని తొలగించి, ఆ స్థానంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు, నీర్మాలకు చెందిన సీనియర్ నాయకుడు నల్ల శ్రీరామ్ పేరును ఝాన్సీరెడ్డి ఏకపక్షంగా ప్రకటించారని ఆరోపిస్తూ పెద్ది కృష్ణమూర్తి వర్గం నాయకులు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నారు.
మొదటి రెండు రోజులు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నాలు చేపట్టారు. మూడో రోజు పెద్ది కృష్ణమూర్తి అనుచరుడు ఉప్పుల బాబు దేవరుప్పులలో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. పెద్ది కృష్ణమూర్తికి తిరిగి మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని, దీనిపై ఝాన్సీరెడ్డి ఇక్కడికి వచ్చి ప్రకటన చేయాలని గంట పాటు హల్చల్ చేశాడు.
తాజాగా శనివారం పెద్ది కృష్ణమూర్తి వర్గం అనుచరులు, కార్యకర్తలు వందలాది మంది వాహనాల్లో హైదరాబాద్లోని గాంధీభవన్కు తరలివెళ్లి నిరసన తెలిపారు. పెద్ది కృష్ణమూర్తికి తిరిగి మండల అధ్యక్ష పదవి కట్టబెట్టాలని నినదించారు. పాలకుర్తిలో ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి పేరుకే ఉన్నారని, పెత్తనమంతా ఆమె అత్త ఝాన్సీరెడ్డిదేనని కార్యకర్తలు ఆరోపించారు. ఈ క్రమంలో టీ-పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ వీరి వాదన విని న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు.
– పెద్ది కృష్ణమూర్తి
మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న. పార్టీ మండల అధ్యక్షుడిగా ఎన్నో కష్టనష్టాలకోర్చి పార్టీని ముందుకు తీసుకెళ్లా. అసెంబ్లీ ఎన్నికల్లో యశస్వినీరెడ్డిని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించిన ఘనత దేవరుప్పుల కాంగ్రెస్ శ్రేణులకుంది. నియోజకవర్గ ఇన్చార్జీనని చెప్పుకుంటున్న ఝాన్సీరెడ్డి పలు పార్టీల నుంచి ఎంతోమందిని చేర్చుకుంటున్నారు.
వారి మాటలే వింటూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే నన్ను అధ్యక్ష స్థానం నుంచి తొలగించి మరొకరికి ఇవ్వడం వెనక చాలా సంగతులున్నాయి. వనరుల దోపిడీ, ఇసుక అక్రమ రవాణాకు నేను అడ్డుగా ఉన్నానని తొలగించారు. ఝాన్సీరెడ్డిది ఈ దేశమే కాదు.. ఆమెకు కాంగ్రెస్లో సభ్యత్వమే లేదు. ఆమె పెత్తనం కాంగ్రెస్ పార్టీకి నష్టమే.