రాహుల్గాంధీపై ఈడీ విచారణ నేపథ్యంలో జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ నిరసన
ఘర్షణ పడిన బలరాంనాయక్, భరత్చందర్రెడ్డి వర్గీయులు
చెదరగొట్టిన పోలీసులు
మహబూబాబాద్, జూన్ 17 : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, సీనియర్ నేత రాహుల్గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మదర్థెరిసా సెంటర్లో ఆ పార్టీ నాయకులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మహబూబాబాద్ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ మురళీనాయక్ మాట్లాడుతుండగా పార్లమెంట్ మాజీ సభ్యుడు పోరిక బలరాంనాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్చందర్రెడ్డి వర్గీయులు ఘర్షణకు పాల్పడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
విషయం తెలుసుకున్న మహబూబాబాద్ టౌన్, రూరల్ సీఐలు సతీశ్, రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఒకానొక సందర్భంలో ‘నా కొడకా అంటే నా కొడకా’ అంటూ దూషించుకుంటూ ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో అక్కడ ఉన్న ప్రజలు కాంగ్రెస్ నాయకుల్లో సఖ్యత లేదని చర్చించుకోవడం గమనార్హం. కాగా, కాంగ్రెస్ నాయకులు ఇలా ఘర్షణ పడడం ఇది మొదటి సారి కాదు. 2019 ఎంపీ ఎన్నికల సమయంలో, ఆ తర్వాత ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాల్లో డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన నాయకులు బాహాబాహీకి దిగి తన్నుకునేంత పని చేశారు.