సుబేదారి, జూన్ 4 : రాష్ట్ర పోలీసు వ్యవస్థలో సీఎం కేసీఆర్ అనేక మార్పులు తీసుకువచ్చి, దేశానికి ఆదర్శవంతగా నిలిపారని, తెలంగాణలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వరంగల్ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సురక్షా దినోత్సవం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి ఎర్రబెల్లి పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి నక్సలిజం, గుండాయిజం నుంచి రాజకీయ నాయకులను కాపాడడం కోసం, స్వీ య రక్షణ కోసం పోలీసులు పనిచేశారన్నారు. అప్పుడు పాతబడిన వాహనాలు ఉండేవని, పోలీసు స్టేషన్ల మెయింటనెన్స్కు డబ్బులు కూడా లేవని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పోలీసు వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకుచ్చి సమూలంగా మార్పులు చేయడంతో ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందుతున్నాయన్నారు. ఆధునిక టెక్నాలజీతో రాష్ట్రంలో ఏ మూలన నేరం జరిగినా పోలీసులు వెంటనే నేరస్తులను గుర్తించి, కఠిన శిక్ష పడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మహిళల భద్రత కోసం రాష్ట్రంలో 331 షీ టీమ్స్ ఏర్పాటు చేశామని, మనల్ని చూసి ఇతర రాష్ర్టాల్లో షీటీమ్స్ ప్రవేశపెడుతున్నారని మంత్రి చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో నేరా లు పూర్తి స్థాయిలో అరికట్టడానికి దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్లో న్యూయార్క్ మాదిరిగా కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసి పకడ్బందీ పోలీసు వ్యవస్థను ప్రజల ముంగిట్లోకి తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. పోలీసు వ్యవస్థను మరిం త బలోపేతం చేయడానికి వాహనాలు, టెక్నాలజీ పరికరాలతో పాటు, 28,277 మంది పోలీసు సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం నియమించినదని మంత్రి గుర్తు చేశారు. పేపర్ లీకేజీ చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిని పట్టుకున్నందుకు సీపీ రంగనాథ్ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పోలీసు శాఖలో అనేక మార్పులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ బాగా పనిచేస్తున్నారని అభినందించారు. అనంతరం సీపీని శాలువాతో మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, గ్రేటర్ వరంగల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నన్నపునేని నరేందర్, జడ్పీ చైర్మన్లు సుధీర్కుమార్, గండ్ర జ్యోతి, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బం ది పాల్గొన్నారు. కాగా, ముగింపు కార్యక్రమంలో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.