Congress | వరంగల్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ గ్రూపుల పార్టీ అని మరోసారి స్పష్టమైంది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా నాయకులు పోటీపడుతున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్లో అనూహ్య పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, జనగామ డీసీసీ మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి మధ్య పోరు తీవ్రమవుతున్నది. ఒకరికి ఒకరు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య, వీరి వర్గాల మధ్య నిత్యం పంచాయితీలు జరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరో పెద్ద పంచాయితీ తెరపైకి వచ్చింది. నాయిని రాజేందర్రెడ్డికి పోటీగా జంగా రాఘవరెడ్డి హంటర్ రోడ్డులో సొంత కార్యాలయాన్ని ప్రారంభించాడు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయమని పేరు పెట్టాడు. కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర స్థాయి అగ్రనేతలతో కలిపి జంగా ఫొటోతో బోర్డును ఏర్పాటు చేశారు. జంగా ఆఫీసు ప్రారంభం వ్యవహారం ఇప్పుడు వరంగల్ పశ్చిమ కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. నాయిని రాజేందర్రెడ్డి వరంగల్ పశ్చిమ సెగ్మెంట్ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ సెగ్మెంట్లో టీడీపీ పోటీ చేసింది. ఆ ఎన్నికల అనంతరం నాయిని ఈ సెగ్మెంట్లోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. రెండు నెలల క్రితం వరకు వరంగల్, హనుమకొండ జిల్లాలకు డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించేవారు.
ఇటీవల పార్టీ పరంగా చేసిన మార్పులతో నాయిని రాజేందర్రెడ్డి హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ హోదాతో పశ్చిమలో డీసీసీ ఆఫీసు కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన జంగా ఆ తర్వాత తన రాజకీయ కేంద్రాన్ని వరంగల్ పశ్చిమ సెగ్మెంట్కు మార్చుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ఇప్పటికే పలుసార్లు ప్రకటించాడు. ఇదే అంశంపై నాయిని, జంగా వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. పరస్పరం తిట్టుకోవడం, కొట్టుకోవడం జరుగుతున్నాయి. చివరికి పార్టీ నుంచి సస్పెన్షన్ల వరకు వెళ్లింది. పీసీసీ జోక్యం చేసుకున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రెండు వర్గాల పోరు మరింత ముదురుతున్నది. ఈ పరిణామాలు కాంగ్రెస్ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నాయి.
వరంగల్ పశ్చిమ(హనుమకొండ) నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్నది. బీఆర్ఎస్(టీఆర్ఎస్) ఆవిర్భావం నుంచి ఇదే పార్టీ గెలుస్తున్నది. వరుసగా ఐదుసార్లు గులాబీ పార్టీ ఇక్కడ విజయం సాధించింది. 1998 ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ ఈ స్థానంలో ఎప్పుడూ గెలవలేదు. రెండున్నర దశాబ్దాలుగా ఇక్కడ ప్రాతినిథ్యం లేకుపోవడంతో కాంగ్రెస్కు బలం లేకుండాపోయింది. ఈ సెగ్మెంట్లో అసలే అంతంతమాత్రం బలం ఉన్న కాంగ్రెస్లో ఇప్పుడు గ్రూపు రాజకీయం ఆ పార్టీ శ్రేణులను నైరాశ్యంలో పడేస్తున్నది. టికెట్ కోసం పోటీ కాకుండా ఇక్కడి గ్రూపు పంచాయితీలు ఏకంగా డీసీసీ మాజీ అధ్యక్షుడు జంగాను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వరకు వెళ్లాయి. అయినా ఆగకుండా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకే కార్యక్రమాన్ని రెండు వర్గాలు వేర్వేరు చోట్ల నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు పోటాపోటీ ఆఫీసుల ప్రారంభంతో హస్తం పార్టీలో మరింత అయోమయం నెలకొన్నది.