చిట్యాల (మొగుళ్లపల్లి), మార్చి 28 : ‘కాంగ్రెస్ ఎన్నికల ముందు చెప్పినవన్నీ అబద్ధాలే. అంతా మోసమే. దొంగ హామీలతో రైతులను ముంచి గద్దెనెకింది. సాగునీటి నిర్వహణలో ఘోరంగా విఫలమై, పంటలు ఎండబెడుతూ రైతన్న పొట్టకొడుతున్నది’ అని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు. గురువారం మొగుళ్లపల్లి మండలం కాసులపాడు గ్రామ శివారులో సాగునీరందక ఎండిపోయిన వరి పంటలను ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు రైతులు ఎలాంటి గోసలుపడ్డారో ఇప్పడు మళ్లీ అదే దుస్థితి పునరావృతం అవుతున్నదన్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు ఏనాడూ సాగునీటి కష్టాలు లేవని, ఎక్క డా ఎకరం కూడా ఎండనివ్వకుండా నీరందించినట్లు చెప్పారు. పంటలు బాగా పండాయని, సాగు బంగారమైందని చెప్పారు.
కానీ, కాంగ్రెస్ మూడు నెలల పాలనలో రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ యంత్రాంగానికి యాసంగి పంటలకు నీరందించే సోయి లేదని విమర్శించారు. నష్టపోయిన రైతులు మనోధైర్యం కోల్పోవద్దన్నారు. గ్రామ శివారులో 100 ఎకరాలు సాగు చేయగా 25 ఎకరాలు సాగునీరు అందక ఎండిపోయిందని తెలిపారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహా రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బల్గురి తిరుపతిరావు, నాయకులు రమేశ్, రైతులు కోడెపాక కొమురయ్య, ఐలయ్య, దాసరి ప్రకాశ్రెడ్డి, చిగురుమామిడి చిన్నరవి, ఈశ్వర య్య, భద్రయ్య, పెద్ద రాజయ్య, భాసర్ పాల్గొన్నారు.