రేగొండ, మార్చి 27 : కాంగ్రెస్ పాలనలో రైతులు ఎన్నడూ బాగుపడింది లేదని, వారికి ఎప్పుడూ కన్నీరే మిగుల్చుతున్నారని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. బుధవారం రేగొండ మండలకేంద్రంతో పాటు చెంచుకాలనీ, తిరుమలగిరి, రంగయ్యపల్లె గ్రామాల్లోని ఎండిపోయిన వరి పంటలను వారు వేర్వేరుగా పరిశీలించారు. రైతులు మైస రమేశ్, వెన్నల శ్యాం, మైస స్వామి, మేకల ఎల్లయ్య, కున్నాటి నారాయణరెడ్డి, సామల లింగారెడ్డితో ఎమ్మెల్సీ సిరికొండ మాట్లాడి వారి సమస్య లు తెలుసుకున్నారు. ఎకరానికి రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయామంటూ ఆవేదనతో చెప్పారు. స్పందించిన సిరికొండ అక్కడినుంచే జిల్లా వ్యవసాయ, ఇతర అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని కోరారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పల్లెల్లో కాంగ్రెస్ మూడు నెలల పాలనలో కరువు ప్రాంతాలుగా మారుతున్నాయన్నారు.
పంట చేతికొచ్చే సమయంలో సాగు నీరు ఇవ్వకపోవడంతో పశువులను మేపాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎన్నడూ సాగునీరు లేక పంటలు ఎండిపోలేదని ఎండాకాలంలో సైతం డీబీఎం-38 కాల్వల ద్వారా సాగునీటితో చెరువులను నింపడం వల్ల బావులు, బోర్లలో నీటిమట్టం పెరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ 100 రోజల పా లనలోనే రైతులు రోడ్డునపడ్డారన్నారు. అయినా వారిని పట్టించుకున్న నాథుడే లేడన్నారు. రేగొండ మండలంలో 250 ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టం అంచనా వేసి ఎకరానికి రూ.25వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల పక్షాన ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరాకు రూ.15వేలు రైతుబంధు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ వందరోజులైనా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు అంకం రాజేందర్, నాయకులు లెంకల రాజిరెడ్డి, సామల పాపిరెడ్డి, ఈర్ల సదానందం, సూర నర్సింగరావు, గోపు భిక్షపతి, దగ్గు వెంకటేశ్వర్రావు, బండి రమేశ్ పాల్గొన్నారు.