జనగామ/భూపాలపల్లి/ములుగు (నమస్తే తెలంగాణ)/హనుమకొండ, మే 2: పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ ప్రభావమున్నా ప్రజలపై ఇంధన భారం మోపబోమని చెప్పిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంతలోనే మాటమార్చింది. ఐదు రాష్ర్టాల ఎన్నికల ముగియగానే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను భారీగా పెంచింది. త్వరలో డొమెస్టిక్ సిలిండర్ల ధరలు కూడా పెంచే అవకాశం ఉందనే చర్చ జరుగుతున్నది. ఇప్పటికే యుద్ధం వాతావరణ నేపథ్యంలో గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ల సరఫరాలో జాప్యంతోపాటు కొరత ఏర్పడుతున్నది.
గతంలో రెండు రోజుల్లో వచ్చే సిలిండర్.. ప్రస్తుతం వారం, పది రోజులైనా ఇంటికి చేరడం లేదు. ఏడాది కాలంగా మూడుసార్లు డొమెస్టిక్ సిలిండర్ల ధరలు పెంచిన కేంద్రం.., ప్రతినెలా కమర్షియల్ సిలిండర్ల ధరలను ఎంతోకొంత పెంచుతూ వస్తున్నది. తాజాగా, దేశ చర్రితలో ఎన్నడూ లేనివిధంగా రూ. 993 పెంచింది. దీంతో రూ.2,330 ఉన్న ధర ఒక్కసారిగా రూ.3,320కి పెరిగింది. ఈ పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్నచిన్న హోటళ్ల, టీ, టిఫిన్ సెంటర్ల యజమానులపై తీవ్ర ప్రభావం చూపనున్నది. వాస్తవానికి ఈ పెంపు పరోక్షంగా ప్రజలపై పడినట్లేనని హోటల్ యజమానులు అంటున్నారు.
జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ జిల్లాలో 4,15,359 డొమెస్టిక్, 2622 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి రోజూ సుమారు 8,776 డొమెస్టిక్ సిలిండర్లు సరఫరా చేయాల్సి ఉండగా, 6,963 మాత్రమే సరఫరా అవుతున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. వారం నుంచి పది రోజుల బ్యాక్లాగ్ ఉంటున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 1,26,745 గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఇందులో ఉజ్వల 30,725, దీపం 16,450, సీఎస్ఆర్ 10,820, సాధారణ కనెక్షన్లు 68,750 ఉన్నాయి. 13 గ్యాస్ ఏజెన్సీల ద్వారా 1,26,745 మంది వినియోగదారులకు గ్యాస్ సరఫరా జరుగుతుంది.
ములుగు జిల్లాలో 99,857 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, అందులో సాధారణ కనెక్షన్లు 76,558, ఉజ్వల 23,299, కమర్షియల్ 304 కనెక్షన్లు ఉన్నాయి. వినియోగదారుల డిమాండ్ మేరకు రోజుకు 800 నుంచి 900 సిలిండర్లు సరఫరా చేస్తున్నారు.
జనగామ జిల్లాలో 12 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో 1.60 లక్షల డొమెస్టిక్ కనెక్షన్లు, కమర్షియల్ 738 కనెక్షన్లు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో సాధారణంగా రోజువారీగా 300 నుంచి 400 సిలిండర్ల బుకింగ్ ఉండేది. అత్యవసర భయంతో వినియోగదారులు అవసరం లేకున్నా అడ్వాన్స్గా గ్యాస్ కోసం బుకింగ్ చేస్తుండడంతో రోజుకు వెయ్యి నుంచి 1,800కు అంటే మూడు రెట్లు పెరిగింది. బుకింగ్లు గణనీయంగా పెరగడంతో గ్యాస్ కంపెనీల సర్వర్లు కూడా మొరాయిస్తున్నాయని ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం జనగామ పట్టణంలో ప్రతి రోజూ 524 సబ్సిడీ సిలిండర్లు సరఫరా అవుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంతే మొత్తంలో సిలిండర్లు సరఫరా అవుతున్నాయి.
వరంగల్ జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు 3,15056 ఉండగా, కమర్షియల్ కనెక్షన్లు 1452 ఉన్నాయి. జిల్లాలో రోజుకు 5,980 గ్యాస్ సిలిండర్ల డిమాండ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇక గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ల కొరత ఇప్పటికీ కొనసాగుతున్నది. ప్రభుత్వం మాత్రం గ్యాస్ కొరత లేదని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. గ్యాస్ బుక్ చేసిన రెండు రోజుల్లో ఇంటికి చేరాల్సిన సిలిండర్ వారం, పది రోజులైనా డెలివరీ కావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. గ్యాస్ ఏజెన్సీలు సైతం గ్యాస్ వినియోగదారులను ఇబ్బందిపెడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక, ఏజెన్సీ ఆఫీసుల్లోని నంబర్లకు ఫోన్ చేసినా స్పందించడం లేదని మండిపడుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లు సకాలంలో డెలివరీ కాకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మాదిరిగా కట్టెల పొయ్యిలనే వినియోగిస్తున్నారు. గత సంవత్సర కాలంలో డిమెస్టిక్ సిలిండర్ల ధరలను కేంద్రం రెండు సార్లు పెంచింది. 2025 ఏప్రిల్లో రూ.50, 2026 మార్చిలో రూ. 60 పెంచడం జరిగింది. కాగా, కమర్షియల్ సిలిండర్ల విషయంలో సంవత్సర కాలంలో కొన్ని నెలలు తగ్గించినా ఎక్కువ సార్లు పెంచారు. 2025 డిసెంబర్ నుంచి ప్రతి నెలా కమర్షియల్ సిలిండర్ ధరలను పెంచుతూ వస్తున్నది. ఇప్పటి వరకు ఐదుసార్లు కలిపి మొత్తం రూ.1512.50 పెంచినట్లు గణాంకాలు చెబుతున్నాయి.