హనుమకొండ, మార్చి 20: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అనుమానాస్పద లావాదేవీలపై నిఘా పెట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, తదితర శాఖల అధికారులతో డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో నాలుగు నెలలుగా స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల వివరాలు, బ్యాంకుల ద్వారా జరిగిన నగదు లావాదేవీలు, ఎకువ సంఖ్యలో కొనుగోలు చేసిన వస్తువుల వివరాలను సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
దీని ప్రకారమే సమావేశ వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి తెలియజేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సీపీ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణను అధికారులు, సిబ్బంది సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు రాధికాగుప్తా, ఏ వెంకట్రెడ్డి, డీఆర్వో వైవీ గణేశ్, ట్రైనీ ఐపీఎస్ శుభం నాగారలే, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేశ్, నారాయణ, డీఆర్డీవో నాగ పద్మజ తదితరులు పాల్గొన్నారు.
నిబంధనల మేరకు నగదు లావాదేవీల నిర్వహణ ఉండాలని బ్యాంకర్లకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వివిధ బ్యాంకుల ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రూ. 50వేలకు మించి నగదు తీసుకునే ఖాతాదారులకు సూచనలు చేయాలన్నారు. బ్యాం కర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. డీఆర్వో వైవీ గణేశ్, ఎస్బీఐ, యూబీఐ, ఏపీజీవీబీ, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా టీఎన్జీవోలు బుధవారం కలెక్టరేట్లో జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధాశుక్లాను సన్మానించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో యూనియన్ డైరీ ఆవిష్కరించారు. స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలను ఆకుల రాజేందర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ను కలిసిన వారిలో జిల్లా కోశాధికారి రాజేశ్, కేంద్ర సంఘం నేతలు శ్యామ్ సుందర్, లక్ష్మీప్రసాద్, జిల్లా నేతలు సలీం, రామ్ ప్రసాద్, రాజేశ్ ఖన్నా, భరత్, శ్యామ్, రాజు తదితరులు పాల్గొన్నారు.