మహబూబ్నగర్, నవంబర్ 30 : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లా చౌరస్తా వద్ద ఉన్న పోలింగ్ బూత్ నెంబర్ 222లో కలెక్టర్ రవినాయక్ ఓటర్లతో సమానంగా క్యూలైన్లో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కలెక్టర్ రవినాయక్ విలేకరులతో మాట్లాడుతూ మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు వేసేందుకు అన్ని సౌకర్యాలు కల్పించామని, ఉదయం 7 గంటలకే 835 పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభమైనట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో పురుషులకు, మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 80 యేండ్లకుపైగా వారికి, దివ్యాంగులకు హోం ఓటింగ్ అవకాశం కల్పించామని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుందని పర్యవేక్షించేందుకు గానూ కలెక్టర్ రవినాయక్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంలో కూర్చోని పోలింగ్ సరళిని ప్రత్యేకంగా పర్యవేక్షించారు. అవసరమైన పోలింగ్ కేంద్రాలకు సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సూచనలు, సలహాలు అందించారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండ పోలింగ్ ప్రక్రియ జరిగిందని కలెక్టర్ వివరించారు.