మంగపేట, జనవరి 31 : మండలంలోని కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీని బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి సీనియర్ మేనేజర్ ప్రసాద్నాయర్తో కలిసి పరిశీలించారు. పరిశ్రమ లోపల స్థలంతో పాటు, కార్మికులు నివాసముండే కాలనీ, గోదావరి తీరంలోని ఇన్టేక్వెల్, ఫ్యాక్టరీ అనుబంధ పాఠశాల, సరిహద్దులను రెవెన్యూ, పంచాయతీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో చేసిన సర్వే నివేదికను పరిశీలిస్తూ ఫ్యాక్టరీకి సంబంధించి మొత్తం స్థలం ఎంత? సర్వే నంబర్ల వివరాలను తెలుసుకున్నారు. ఫ్యాక్టరీ మూతపడినప్పటికీ అసౌకర్యాల మధ్య నడుస్తున్న థాపర్ విద్యావిహార్ పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. ఆమె వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, తహసీల్దార్ వీరస్వామి, ఎంపీడీవో ఆలేటి సుదర్శన్, డిప్యూటీ తహసీల్దార్ మల్లేశ్వర్రావు, ఆర్ఐ కుమారస్వామి ఉన్నారు.
కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ, కార్మికుల కాలనీకి సంబంధించి పన్ను బకాయిలు చెల్లించాలని గ్రామ పంచాయతీ అధికారులు బుధవారం బిల్ట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. క్వార్టర్స్ పన్ను రూ. 85,84,507, ఫ్యాక్టరీ పన్ను రూ.1,50,59,992 కలిపి మొత్తం రూ. 2,36,44,499 సకాలంలో చెల్లించని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులో తెలిపారు.