గీసుగొండ, మార్చి 10: ‘ఒకటో తరగతి నుంచి కలెక్టర్ అయ్యే వరకూ నా విద్యాభ్యాసమంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే సాగింది’ అని కలెక్టర్ డాక్టర్ బీ గోపి అన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం జడ్పీహెచ్ఎస్ ఏర్పాటై 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థులు ప్లాటినం జూబ్లీ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్తోపాటు డీఈవో వాసంతి, అల్యూమిని అసోసియేషన్ అధ్యక్షుడు గాదె దయాకర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం దయాకర్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధర్మారం పాఠశాల 75 వసంతాల వేడుకను పూర్వ విద్యార్థులు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ధర్మారం ప్రభుత్వ పాఠశాల రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పూర్వ విద్యార్థులు, వారి గురువులు ఒకే వేదికపై కలుసుకోవడం గొప్ప విషయమన్నారు. మన బస్తీ-మన బడి కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడులను అభివృద్ధి చేస్తున్నదన్నారు.
ధర్మారం పాఠశాలకు రూ. 60 లక్షల నిధులను మంజూరు చేసి పనులు చేస్తున్నట్లు చెప్పారు. పూ ర్వ విద్యార్థులు సహకరిస్తే పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి రూ. 50 వేల విరాళం ఇస్తే వారు ఎస్ఎంసీ కమిటీలో సభ్యులుగా ఉంటారన్నారు. ఆపై విరాళాలు అందజేస్తే తరగతి గదికి, బ్లాక్లకు వారి పేర్లు లేదా వారు సూచించిన వారి పేర్లను పెట్టుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అల్యూమిని అసోసియేషన్లను ఏర్పాటు చేసుకొని పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వం విద్యాంజలి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నదన్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా పూర్వ విద్యార్థులు తమకున్న ఖాళీ సమయాల్లో పాఠశాలకు వచ్చి విద్యార్థులకు బోధించొచ్చన్నారు. తొలిమెట్టు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ విశ్వనాయణ, హెచ్ఎం సుజాత, అల్యూమిని కమిటీ సభ్యులు వెంకటేశ్, సందీప్, కే బాబు, నవీన్రాజు, వెంకట్నారాయణ, జీవన్కుమార్, శ్రీకాంత్, శ్రీనివాస్, నర్సింహరెడ్డి, పూర్వవిద్యార్థులు, టీచర్లు పాల్గొన్నారు.