కలెక్టర్ భవేశ్మిశ్రా
కన్నెపల్లిలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష
కాళేశ్వరం, జూలై 7 : కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ముంపునకు గురవుతున్న భూములను సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్ భవేశ్మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మహదేవపూర్ మండలం లక్ష్మీ(కన్నెపల్లి)పంప్హౌస్ సమవేశ మందిరంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. లక్ష్మీ(మేడిగడ్డ), సరస్వతి (అన్నారం) బరాజ్ల బ్యాక్ వాటర్తో ఎన్ని ఎకరాల భూమి ప్రతీ సంవత్సరం ముంపునకు గురవుతున్నదని ఈఈలు తిరుపతిరావు, యాదగిరిని అడిగి తెలుసుకొని రిపోర్టు ఇవ్వాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న సీఎంతో సమావేశం ఉన్నదని, ముంపు ప్రాంతాలపై ఆయనకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో జడ్పీసీఈవో శోభారాణి, డీఎస్పీ బోనాల కిషన్, డీఈఈలు సూర్యప్రకాశ్, సతీశ్, రవిచంద్ర, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శంకర్, మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు, ఎంపీపీ రాణీబాయి, జడ్పీటీసీ అరుణ, తదితరులు పాల్గొన్నారు.
వ్యాపారాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలి
భూపాలపల్లి రూరల్ : జిల్లాలోని మహిళా సంఘాలు వ్యాపారాలు చేసుకోవడానికి ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం ప్రగతిభవన్లో మహిళా సంఘాలు స్వయం ఉపాధి పొందేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాలు, వసూలు, జిల్లాలో చేసిన ధాన్యం కొనుగోళ్లు, ఏప్రిల్, మే, జూన్లో మండలాల వారీగా జరిగిన ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2,690 మహిళా సంఘాలున్నాయని, సభ్యులు వ్యాపారాలు చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ దివాకర, డీఆర్డీవో పురుషోత్తం, అడిషనల్ డీఆర్డీవో సురేశ్, డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.