జయశంకర్ భూపాలపల్లి, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ గనుల్లో అధికారులు నాణ్యతలేని పరికరాలతో పనులు చేయిస్తున్నారని, ఈ క్రమంలోనే కేటీకే 5 ఇైంక్లెన్లో జరిగిన ప్రమాదంలో షార్ట్ ఫైరర్ కార్మికుడు శ్రీరాముల ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డాడని కార్మికులు మండిపడుతున్నారు. కార్మికుని చేతిలో పూర్ణి (మందుగుండు సామాగ్రి) పేలి అరచేయి తునాతునకలైంది. అంతేకాకుండా గనిలో భారీ ప్రమాదం తప్పింది. కేటీకే 5 ఇైంక్లెన్లో సోమవారం ఫ్రీ షిప్టులో కార్మికులు గనిలో పూర్ణితో బొగ్గు పొరలను పేల్చే పనిలో నిమగ్నమయ్యారు. గనిలోని ఎస్ఎస్2, 32 లెవల్లో షార్ట్ ఫైరర్ కార్మికుడు శ్రీరాముల ప్రదీప్తో పాటు మరి కొంతమంది విధులు నిర్వహిస్తున్నారు.
కాగా, ప్రదీప్ పూర్ణిని అరచేతిలో పట్టుకుని స్కాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో పూర్ణి ప్రమాదవశాత్తు పేలడంతో అతని చేతి వేళ్లు తెగిపడ్డాయి. చేయిని శరీరానికి సమీపంలో పెట్టుకుని స్కాన్ చేస్తే ప్రదీప్ బతికే వాడు కాదని కార్మికులు చెప్తున్నారు. పక్కనే కార్మికులు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందన్నారు. గాయపడిన కార్మికుడిని వెంటనే స్ట్రక్చర్పై గని బయటికి తీసుకురావాల్సి ఉండగా కేవలం ఒక కార్మికుడు మాత్రమే కొంత దూరం నడిపించి మ్యాన్ రైడింగ్పై తీసుకురావడంపై కార్మికులు మండిపడుతున్నారు. ప్రమాదం జరిగిన సుమారు గంటకు గని బయటికి తీసుకొచ్చారని, కనీసం నలుగురు కార్మికులు వెంట రావాల్సి ఉండగా ఒంటరిగా ఎలా తీసుకువస్తారని, అతనికి ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. గని ప్రమాదం జరిగినా గనిపై ఉన్న ప్రథమ చికిత్స కేంద్రం మాత్రం తెరుచుకోలేదు.
కొన్నేళ్లుగా సింగరేణికి సరఫరా అవుతున్న పూర్ణిలను పక్కన పెట్టి ఆధునిక టెక్నాలజీ పేరుతో ఇతర పూర్ణిలను కొనుగోలు చేసి స్కానింగ్ విధానం ప్రవేశ పెట్టడంతోనే పేలి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతంలో ఉన్న పూర్ణిలతో ఎలాంటి ప్రమాదాలు జరుగలేదని చెప్తున్నారు. కమీషన్ల కోసం నేతలు, అధికారులు కుమ్మక్కై సీడాట్, సోలార్, ఐడిల్, ఆర్ఐపీఎల్ (ఇంద్ర) పూర్ణిలను ప్రవేశపెట్టి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు. కేటీకే 6 ఇైంక్లెన్లో ఒక కోల్కట్టర్ కార్మికుడు పూర్ణి పేలి గాయాలకు గురయ్యాడని, ఇటీవల కేటీకే 5 ఇైంక్లెన్లో కార్మికుడు పూర్ణి పేలి గాయాలకు గురికాగా అధికారులు బయటికి పొక్కనివ్వకుండా జాగ్రత్త పడ్డారని కార్మిక సంఘ నాయకులు చెప్తున్నారు. కేటీకే 5ఎ గనిలో ఇప్పటి వరకు మ్యాన్రైడింగ్ పనులు పూర్తి చేయకుండా పక్కన పడేయడంతో కార్మికులు నడిచి విధులకు హాజరై తిరిగి నడిచి రావల్సి వస్తుందంటున్నారు.
సింగరేణి సంస్థలో ఏళ్ల తరబడి ఉపయోగిస్తున్న పూర్ణిలను ఎందుకు పక్కన పెట్టారు. కొత్తరకం పూర్ణిలతో కార్మికుల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు. సీడాట్, సోలార్, ఐడిల్, ఆర్ఐపీఎల్ (ఇంద్ర) అనే కంపెనీల పూర్ణిలను అధికార పార్టీ , యాజమాన్యం కుమ్మక్కై కమీషన్ల కోసం తీసుకువచ్చారు. వీటితో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. 5వ గనిలో జరిగిన ప్రమాదానికి అధికారులు, అధికార పార్టీ నేతలు బాధ్యత వహించాలి. గతంలో రూ.12 లభించే పూర్ణిలను పక్కన పెట్టి నేడు రూ.285 విలువ చేసే పూర్ణిలను కమీషన్ల కోసం తీసుకువచ్చారు. మరి ఉత్పత్తి పెరిగిందా.. అదీ లేదు. గతంలో జరిగిన ఉత్పత్తే ఇప్పుడు జరుగుతుంది. వెంటనే కొత్త కాంట్రాక్టులను రద్దు చేసి పాత పూర్ణిలను తీసుకురావాలి.
– కామెర గట్టయ్య, సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు