గణపురం, ఏప్రిల్ 15 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేట శివారులోని కేటీకే ఓసీ-3లోని బొగ్గు నిల్వలకు మంటలు అంటుకున్నాయి. దీంతో దట్టమైన పొగ కొండంపల్లి గ్రామాన్ని చుట్టుముట్టడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఓసీ-3 కోసం భూసేకరణలో భాగంగా కొండంపల్లి గ్రామా న్ని తరలిస్తామంటూ పలుమార్లు గ్రామసభలు నిర్వహించి పరిహారాన్ని నిర్ణయించారు. మొదట్లో సింగరేణి యాజమాన్యం వ్యవసాయ భూములను తీసుకోవడంతో పాటు కొండంపల్లి గ్రామాన్ని తరలించి పునరావాస ప్యాకేజీ అందిస్తామని హామీ ఇచ్చింది.
అయితే ఏళ్లు గడుస్తున్నా గ్రామాన్ని తరలించలేదు. ఈ క్రమంలో వేసవి కాలం ఎండ తీవ్రతకు ఓసీలో నిల్వ ఉన్న బొగ్గు అంటుకున్నది. దీంతో మంటలు చెలరేగి దట్టమైన పొగ గ్రామాన్ని కమ్మేయడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురై సింగరేణి అధికారులకు సమాచారమందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం తమ గ్రామాన్ని తరలించి రక్షించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.