మడికొండ, ఏప్రిల్ 24 : బీజేపీ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నదని, దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నదని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అధ్యక్షతన హనుమకొండ జిల్లా మడికొండలో ఏర్పాటుచేసిన ఓరుగల్లు జనజాతర సభకు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బీజేపీకి ఓటేయొద్దని, ఆ పార్టీ అభ్యర్థి అరూరి రమేశ్ను గెలిపిస్తే అందరి భూములను కబ్జా చేస్తారని ఆరోపించారు.
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను విస్మరించిందన్నారు. 20 కోట్ల ఉద్యోగాలను ఇస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు. ఐదేళ్లలో ఆరు గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలను అమలుచేసి తీరుతామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి ఆదుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్రెడ్డిని కోరారు. అలాగే జిల్లాలో సిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని గతంలో రాహుల్గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
గిరిజన శాఖ మంత్రి సీతక మాట్లాడుతూ మోదీ పాలనలో ప్రతి వస్తువుపై జీఎస్టీ విధిస్తున్నారని చెప్పారు. వేసుకునే బట్టలు, కిరాణా వస్తువులు, ఆఖరికి శవాలపై కూడా పన్నులు వేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. దోస్తులకు దోచిపెట్టిన చరిత్ర బీజేపీకే దక్కుతుందన్నారు. బీజేపీ దోపిడీ దొంగల ప్రభుత్వమని, కులాలు, మతాల మధ్య పంచాయితీలు పెడుతున్నదన్నారు. అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గంలో భూకబ్జాలకు పాల్పడిన బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్ కన్ను ఇప్పుడు ఇతర నియోజకవర్గాలపై పడిందన్నారు.
సభలో ఏఐసీసీ జాతీయ కార్యదర్శి రోహిత్ చౌదరి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, మామిడాల యశస్వినీరెడ్డి, ఆయిల్ సీడ్స్, గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కాంగ్రెస్ నేతలు నమిండ్ల శ్రీను, ఖుస్రూపాషా, ఎర్రబెల్లి స్వర్ణ, రాజేశ్వర్రావు, ఈవీ శ్రీనివాస్, పెరుమాండ్ల రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తకళ్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మడికొండ సభలో సీఎం మాట్లాడుతుండగా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు వెళ్లిపోయారు. రేవంత్రెడ్డి మాట్లాడాల్సి ఉండగానే కుర్చీలు ఖాళీ అయ్యాయి. అలాగే మడికొండ చౌరస్తాలో హనుమకొండ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను ధర్మసాగర్ వైపు ట్రాఫిక్ పోలీసులు మళ్లించారు. దీంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. కొద్దిసేపటికే మళ్లీ వాహనాలను యథావిధిగా పంపారు.