కేసముద్రం : మహబూబాబాద్ కాంగ్రెస్ సభలో ముదిరాజ్లను అవమానించడం సరికాదని ముదిరాజ్ మహాసభ జిల్లా కార్యదర్శి ఎదరబోయిన సూరయ్య శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో లక్షా 60వేల ముదిరాజ్ ఓటర్లు ఉండగా, సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్న బహిరంగ సభలో సభా వేదికపై ముదిరాజ్లకు అవకాశం కల్పించకుండా మనోభావాలను దెబ్బతీశారని తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, ఇల్లెందు, ములుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంతో కృషిచేశామని తెలిపారు.
పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ వేదికపైకి పిలువకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ముదిరాజ్లకు సముచిత స్థానం కల్పిస్తామన్న సీఎం రేవంత్రెడ్డి కేవలం ఓటు బ్యాంక్గానే వాడుకుంటూ విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజ్లకు సముచిత స్థానం కల్పించిందని, ముదిరాజ్ల అభ్యున్నతికి పాటుపడిందని వివరించారు. వేసవిలోనూ చెరువులకు నీటిని విడుదల చేయడం వల్ల చేపల లభ్యత పెరిగి ఆర్థికంగా ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. ముదిరాజ్లను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని, బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవితకు ఓటు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.