మహబూబాబాద్, ఏప్రిల్ 19 : విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని మోదీకి ఓటడిగే హక్కులేదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గెలుపును కాంక్షిస్తూ స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అవినీతి సొమ్మును బయటకు తీసి పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని మాయమాటలు చెప్పి మోసం చేశారన్నారు. దేశంలోని 97శాతం మంది సొమ్మును 3శాతం ఉన్న కార్పొరేట్ సంస్థలకు మోదీ దోచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించేందుకు సోనియమ్మ ప్రయత్నం చేస్తే బీజేపీ ఫ్యాక్టరీ ఊసెత్తలేదని మండిపడ్డారు. అలాంటి బీజేపీకి ఓటు వేస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీని తమకు అనుకూలమైన నాగ్పూర్కు తరలించారని, అలాంటి మోసపూరిత బీజేపీకి ఓటు వేయవద్దని విజ్ఞప్తి చేశారు.
బలరాంనాయక్ అందరివాడని, అందరూ ఓటు వేసి రాహుల్ ఆధ్వర్యంలో దేశంలో ఏర్పడబోయే ఇండియా కూటమి ప్రభుత్వం నుంచి మంత్రి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 14 మంది ఎంపీలను గెలిపిస్తే వాళ్లను నేను, మా మిత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావులం వెంట బెట్టుకుని ఢిల్లీకి వెళ్లి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధులు తీసుకొస్తామన్నారు. భద్రాచలం సాక్షిగా, సోనియమ్మ, రాహు ల్ మాటగా రైతులకు రూ.2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే ఖమ్మం, మహబూబాబాద్లోనే అత్యధిక మెజార్టీ వస్తుందని చెప్పారు. తెలంగాణను ఇచ్చిన సోనియాగాంధీ కొడుకు రాహుల్ను పీఎం చేయడమే లక్ష్యంగా ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి రోహిత్ చౌదరి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క, ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, జాటోత్ రాంచంద్రునాయక్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, యశస్వినీరెడ్డి పాల్గొన్నారు.