వేలేరు, సెప్టెంబర్ 30 : తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ నిధులు మం జూరు చేయగా, గత ఫిబ్రవరిలో మంత్రి కేటీఆర్ సోడాషపల్లిలో పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అవి పూర్తి కావడంతో శనివారం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి గుండ్లసాగర్ శివారులో ఏర్పాటు చేసిన లిప్ట్ పైపులైన్ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా మాట్లాడుతూ రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో సైతం ప్రతి ఎకరం తడిసేలా సాగునీరు అందించేందుకే సీఎం కేసీఆర్ ప్రణాళికా రూపొందించి, అమలు చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగానే నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలైన వేలేరు, ధర్మసాగర్, చిల్పూర్ మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీరు అందించేందుకు నిధులు మంజూరు చేశారని చెప్పారు. గత ఫిబ్రవరిలో మంత్రి కేటీఆర్ సోడాషపల్లిలో లిఫ్ట్ పైపులైన్ పనులకు శంకుస్థాపన చేయగా సూమారు 6 నెలల్లో పనులు పూర్తి చేసి పైపులైన్ ద్వారా సాగునీరు అందించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేశారన్నారు.
గుండ్లసాగర్ శివారులో ఏర్పాటు చేసిన లిప్ట్ పైపులైన్ ద్వారా వేలేరు, లోక్యాతండా, మిరపకుంటతండా, ఎర్రబెల్లి గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు. అలాగే, ధర్మసాగర్ మండలం ముప్పారం, నారాయణగిరి గ్రామాలకు సైతం సాగునీరు చేరుతుందని తెలిపారు. లిప్ట్-2 ద్వారా నష్కల్, ధర్మారాం, వంగాలపల్లి గ్రామాలకు సాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయని, చిల్పూరు మండలంలోని పలు గ్రామలకు సైతం సాగునీరు చేరుతుందన్నారు. త్వరలోనే ఆయా గ్రామాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందుతుందని వివరించారు. అలాగే, లిప్ట్ -3లో భాగంగా కన్నారం చెరువులోకి సాగునీరు అందించేందుకు పనులను ప్రారంభించినట్లు తెలిపారు. వచ్చే యాసంగి సీజన్ వరకు పూర్తి చేసి, కన్నారం, పీచర, వావిల్లకుంట గ్రామాలకు సైతం సాగునీరు అందిస్తామని ఎమ్మెల్సీ పల్లా హామీ ఇచ్చారు. కాగా, గుండ్లసాగర్ శివారులోని పైపులైన్ వద్ద ఎమ్మెల్సీ పల్లా పూజలు చేసి నీటిని విడుదల చేయగా పలు గ్రామాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. సాగునీరు అందించేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ పల్లాకు మండల రైతులు, ప్రజాప్రతినిధులు కృతజ్ఞ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గుండ్రెడ్డి రాజేశ్వర్రెడ్డి, ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి, జడ్పీటీసీ సరితారెడ్డి, వైస్ఎంపీపీ సంపత్, పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహారావు, మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కాయిత మాధవరెడ్డి, మండల కోఆర్డినేటర్ బిల్లా యాదగిరి, వివిధ గ్రామాల సర్పంచ్లు గాదె ధర్మారెడ్డి, అనురాధ, ఎంపీడీవో లక్ష్మీప్రసన్న, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు