వరంగల్ : రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి పథకం ఓ వరంలో మారిందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
గీసుగొండ, సంగెం మండలాలకు చెందిన 107 మంది లబ్ధిదారులకు రూ.కోటి 7లక్షలకు పైగా విలువచేసే చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందని గడపలేదన్నారు.
మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలుచేస్తున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని వివరించారు. మన ప్రభుత్వ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు.
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కండ్లున్నా చూడలేని పరిస్థితుల్లో ప్రతిపక్షాలున్నాయని విమర్శించారు.
70 ఏండ్లుగా జరగని అభివృద్ధి నేడు ఏడేండ్లలో చేసి చూపిన ఘనత కేసీఆర్ది అన్నారు. అన్నంపెట్టే రైతన్నను అక్కున చేర్చుకొని రైతుని రాజును చేశారని పేర్కొన్నారు.