‘లంబాడాలు, ఆదివాసీలు, కోయలను దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ పట్టించుకోలేదు.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తండాలన్నింటినీ పంచాయతీలు చేసినం.. ప్రతి తండాకు రోడ్లు వేసినం.. వజ్రాయుధం లాంటి ఓటును మంచివాళ్లకు వేస్తే మంచి జరుగుతుంది.. లేదంటే ఐదేళ్లు ఏడ్వాల్సి వస్తుంది.. రైతుబంధు, 24గంటల కరెంటు కొనసాగాలంటే రెడ్యా నాయక్ను గెలిపించాలె’ అని సీఎం కేసీఆర్ కోరారు. బీఆర్ఎస్ డోర్నకల్ అభ్యర్థి డీఎస్ రెడ్యా నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం మరిపెడలో నిర్వహించిన నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో వేలాది మంది ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. డోర్నకల్లో వంద పడకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ, ఇంకా మిగిలిన పనులన్నీ చేయించే బాధ్యత తనదని, సీనియర్ నాయకుడైన రెడ్యానాయక్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మహబూబాబాద్, నవంబర్ 21(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ డోర్నకల్ అభ్యర్థి డీఎస్ రెడ్యానాయక్ను గెలిపిస్తే ఇంతకంటే మంచి హోదాలో ఉంటాడని, 24 గంటల కరెంటు, రైతుబంధు కావాలంటే రెడ్యానాయక్ను గెలిపించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం మరిపెడ పట్టణలో నిర్వహించిన డోర్నకల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో కురవి వీరభద్రస్వామిని దర్శించుకున్నానని, ఆ సమయంలో తెలంగాణ వస్తే కురవి వీరభద్రస్వామికి బంగారు కోరమీసాలు సమర్పిస్తానని మొకుకున్నానని, అనుకున్న విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత తానే స్వయంగా వచ్చి శివరాత్రి పండుగ రోజున కురవి వీరభద్రస్వామికి బంగారు కోరమీసాలు సమర్పించానని గుర్తుచేశారు. ‘ఆ తర్వాత ఆలయాన్ని 5కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకున్నాం. డోర్నకల్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ నుంచి రెడ్యానాయక్ నిలబడ్డాడు.
వేర్వేరు పార్టీల నుంచి మరికొందరు నిలబడ్డారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే. అభ్యర్థుల గుణగణాలతో పాటు వారి వెనకున్న పార్టీల గత చరిత్ర తెలుసుకొని ఓటెయ్యాలి. వజ్రాయుధం లాంటి ఓటును మంచి వాళ్లకు వేస్తే మంచి జరుగుతుంది. లేదంటే ఐదేళ్లు ఏడ్వాల్సి వస్తుంది. డోర్నకల్ నియోజకవర్గంలో వెన్నారం కాలువ అయితదని ఎవరూ అనుకోలేదు. రెడ్యానాయక్, శంకర్నాయక్ ఇద్దరూ వెంటపడి పని చేయించుకున్నరు. ఖమ్మం నుంచి వస్తున్న సీతారామ, పాలమూరు ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో నాలుగు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తాం. లంబాడా, ఆదివాసీలు, కోయల గురించి దశాబ్దాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో తండాలన్నింటినీ గ్రామ పంచాయతీలుగా చేసుకున్నం. డోర్నకల్ నియోజకవర్గంలో 82 తండాలను పంచాయతీలుగా చేసుకున్నం. ప్రతి తండాలో బీటీ, సీసీరోడ్లు వేసుకున్నం.
డోర్నకల్లో వంద పడకల ఆసుపత్రితో పాటు డిగ్రీ కాలేజీ, ఇతర మిగిలిన పనులన్నీ చేయించే బాధ్యత నాది. సీనియర్ నాయకుడైన రెడ్యానాయక్ను గెలిపించాలని కోరుతున్న. కారు గుర్తుకు ఓటు వేసి రెడ్యానాయక్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.’ అని ప్రజలను కోరారు. సభలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే శంకర్ నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావు, ఎంపీపీలు గుగులోత్ పద్మావతి, గుగులోత్ అరుణ, బాలు, జడ్పీటీసీలు వెంకట్రెడ్డి, కమలారామనాథం, శారద, మున్సిపల్ చైర్మన్లు సింధూర కుమారి, వాంకుడోత్ వీరన్న, డీఎస్ రవిచంద్ర, మహేందర్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, పరకాల శ్రీనివాస్రెడ్డి, కేఎస్ఎన్ రెడ్డి, ముత్యం వెంకన్నగౌడ్, రామసహాయం రంగారెడ్డి, శ్రీరంగారెడ్డి, దంతాలపల్లి మహిళా అధ్యక్షురాలు గిరివాణి, ఎంపీటీసీ నాయకి, చిన్నగూడూరు మండల మహిళా అధ్యక్షురాలు నిరూప పాల్గొన్నారు.