వరంగల్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎస్సీల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో ఎల్లేశ్ గొప్ప స్ఫూర్తిని చాటాడు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నయీంనగర్ లష్కర్సింగారం ఎస్సీకాలనీకి చెందిన ఎల్లేశ్ ‘దళితబంధు’ సాయంతో వాహనాన్ని కొనుగోలు చేసి వైకుంఠరథంగా మార్చి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఉపాధి కల్పన కోసం చాలామంది వివిధ రకాల వ్యాపారాల కోసం, వాహనాలు కావాలని అందులో పేర్కొన్నా.. ఎల్లేశ్ మాత్రం వైకుంఠరథం కోసం వాహనం కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. దళితబంధు పథకం లబ్ధిదారుగా ఎంపికయ్యాడు. ఎనిమిది నెలల క్రితం వాహనాన్ని కొనుగోలు చేశాడు. దాన్ని వైకుంఠరథంగా మార్చి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సేవలోనూ తన ఔన్యతాన్ని చాటుకుంటున్నాడు. తన సొంత ఏరియా లష్కర్సింగారంలోని ఎస్సీకాలనీలో ఎవరు చనిపోయినా వెయ్యి రూపాయాలతోనే శవాన్ని శ్మశానవాటిక వరకు తీసుకెళ్తున్నాడు. ఇతరులకు అయితే రెండు వేల రూపాయలకే ఈ సేవలందిస్తున్నాడు.
అనుకున్నది నెరవేరింది..
వైకుంఠరథం కోసం వాహనం కొనాలని ఎప్పటినుంచో అనుకుంటున్న. తాహతు లేక కొనలేదు. ఎవలూ లోన్ ఇయ్యలేదు. దళితబంధుతో వచ్చిన పది లక్షలతో టాటా ఏస్ కొన్న. మా నాన్న రాజయ్య జ్ఞాపకార్థం వాహనం పెట్టాలనుకున్న కోరిక నెరవేరింది. పది మందికి సహాయం చేయాలని వైకుంఠ రథం వాహనాన్ని ఎంచుకున్నా. దళితబంధు వాహనాన్ని చూసి చాలా మంది మంచి ఆలోచన చేసినవ్ అని అంటున్నరు. సీఎం కేసీఆర్ వల్ల ఎవ్వరికీ రూపాయి ఇయ్యకుండా పది లక్షలు బ్యాంకు అకౌంట్లో పడ్డయ్.
– అలువాల ఎల్లేశ్, దళితబంధు లబ్ధిదారుడు
వైకుంఠ రథంగా మార్పు..
2022 జూన్ 10న హనుమకొండ కలెక్టరేట్ ఆవరణలో టాటా ఏస్ వాహనాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ చేతుల మీదుగా ఎల్లేశ్ అందుకున్నారు. వాహనాన్ని వైకుంఠరథంగా మార్చేందుకు ఎల్లేశ్కు ఎన్నో అవాంతరాలు వచ్చాయి. తన ఆలోచన చెబితే ఎంతోమంది హేళన చేశారు. కానీ ఎవరు వద్దన్నా తను ఎంచుకున్నట్టే వైకుంఠరథాన్ని తీసుకున్నాడు. టాటా ఏస్ వాహనాన్ని మోడీఫై చేశారు. అలా తీర్చిదిద్దడానికి రెండు నెలల సమయం పట్టింది. వైకుంఠ రథంగా ముస్తాబు చేసి దళితబంధు స్కీం పొందినట్లు రాసి ఉంచడం అందరినీ ఆకట్టుకుంది.
25 ఏండ్లుగా..
ఎల్లేశ్ తండ్రి రాజయ్య 50 ఏళ్లు నయీంనగర్ చిన్నమోరీ వద్ద ఉన్న పాతరైస్ మిల్లులో రిక్షా తొక్కుకుంటూ, పోచమ్మకుంట శ్మశానవాటికలో బొందలు తీస్తూ డప్పు కొట్టేవాడు. పక్కనే ఉన్న ఎస్సీ శ్మశానవాటిలో ఐదేళ్లపాటు వాచ్మన్గా పనిచేశాడు. రాజయ్య రెండో కొడుకు ఎల్లేశ్ ఆర్థిక పరిస్థితులు కారణంగా చదువు మానేసి తండ్రికి చేదోడువాదోడుగా నిలిచాడు. రాజయ్య 2015లో అనారోగ్యంతో చనిపోవడంతో ఎల్లేశ్ తండ్రి వృత్తిని కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
గ్రేటర్ వరంగల్ నగరంలోని ఏడు డివిజన్ల ప్రజలకు పోచమ్మకుంట శ్మశానవాటిక చివరి మజిలీగా ఉంటున్నది. ఎల్లేశ్ 7వ తరగతి వరకే చదువుకున్నాడు. పోచమ్మకుంట శ్మశానవాటిక పక్కన ఉన్న ఎస్సీ శ్మశానవాటికలో 25 ఏండ్లుగా బొందలు తీయడం, డప్పుకొడుతూ జీవనం సాగిస్తున్నాడు. వైకుంఠ రథం వాహనం కోసం ఎల్లేశ్ గతంలో ఫైనాన్స్ కోసం బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలను ప్రయత్నించినా ఏ ఒక్కరూ అప్పు ఇవ్వలేదు. తక్కువగా చేసి మాట్లాడారు. అంతేగాక వాహనం కోసం అప్పు ఇస్తే ఆయన తిరిగి కట్టకుంటే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోలేము కదా అని కొందరు అవమానించారు కూడా. అప్పుడు నిరాశకు లోనైనా.. దళితబంధు పథకంతో తన ఆలోచనను నిజం చేసుకున్నాడు. అతడి భార్య కవిత కూడా భర్త ఇష్టాన్ని గౌరవించి వెన్నుదన్నుగా నిలిచింది.