పేదలకు మెరుగైన వైద్యం, విద్యార్థులకు వైద్య విద్య అందాలంటే ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల ఉండాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఇప్పటికే మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లిలో వైద్య కళాశాలలు ఏర్పాటు కాగా గతంలో ఇచ్చిన హామీ మేరకు ములుగు, వరంగల్ జిల్లా నర్సంపేటకు మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 100 ఎంబీబీఎస్ సీట్ల సామర్థ్యంతో కళాశాలలు ఏర్పాటు కానుండగా, ఆయా జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఇటు ములుగులో ప్రభుత్వ దవాఖానను అప్గ్రేడ్ చేసి కళాశాలకు అనుబంధంగా మార్చనుండగా, నర్సంపేటలో ఇప్పటికే వంద పడకల వైద్యశాల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
– ములుగు, జూలై 5 (నమస్తేతెలంగాణ)/ నర్సంపేట
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో వైద్య ఆరోగ్యశాఖను బలోపేతం చేసిన సీఎం కేసీఆర్, ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో నర్సంపేట, ములుగు జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 100 ఎంబీబీఎస్ సీట్ల సామర్థ్యంతో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానుండగా జిల్లా ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. కాగా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఆయా జిల్లాల్లో బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు సంబురాలు జరుపుకొన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
మెడికల్ కళాశాల కోసం జిల్లా దవాఖానను అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దీనిని మెడికల్ కాలేజీకి అనుబంధంగా మార్చారు. వైద్య కళాశాలతో పాటు జిల్లాలోని రెండు దవాఖానల్లో 400 పడకల సామర్థ్యానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాలేజీకి కావాల్సిన వైద్య పరికరాలు, ఫర్నిచర్, మౌలిక వసతులను టీఎస్ఎంఎస్ ఐడీసీ ద్వారా కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ గత నెలలో ములుగులో పర్యటించినప్పుడు ఇక్కడ మెడికల్ కళాశాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. చెప్పిన మేరకు మంజూరు చేయడంతో జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానికంగా సంబురాలు వెల్లువెత్తాయి నర్సంపేటలోని దామెర చెరువు సమీపంలో 250 పడకలతో ప్రభుత్వ దవాఖాన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ దవాఖానకు వైద్య సిబ్బంది పోస్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో నర్సంపేటలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. క్రిటికల్ కేర్ సెంటర్ కూడా మంజూరైంది. ఇటీవల టీ డయాగ్నస్టిక్ హబ్ ప్రారంభం కాగా, పీహెచ్సీల నుంచి రక్త నమూనాలు తీసుకొచ్చి పరీక్షలు చేస్తున్నారు.
నర్సంపేటలోని దవాఖానకు మహబాబాబాద్ జిల్లా గంగారం, కొత్తగూడ, గూడూరు మండలాల రోగులు కూడా నిత్యం వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. ఏజెన్సీ పాంత ప్రజలకు పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన ఎంతో ఉపయోగపడుతున్నది. దీంతోపాటు నర్సంపేట డివిజన్లోని నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ, చెన్నారావుపేట మండలాల ప్రజలు, పేదలు వైద్య సేవలు పొందుతున్నారు. ఇక మెడికల్ కళాశాల ఏర్పాటైతే వైద్యులతో పాటు, అన్ని విభాగాలు అందుబాటులోకి వస్తాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో నర్సంపేటకు మెడికల్ కళాశాల మంజూరైంది. మారుమూల ప్రాంతాలకు సైతం సూపర్స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. మెడికల్ కళాశాలతో నర్సంపేట హెల్త్హబ్గా మారుతుంది. పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. నర్సంపేటలో ఇప్పటికే జిల్లాస్థాయి దవాఖాన నిర్మాణం పూర్తికావొచ్చింది. మరో 50 పడకల కోసం రూ.30కోట్లతో క్రిటికల్ కేర్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. పట్టణంలో డయాగ్నోస్టిక్ సెంటర్ను ఇటీవల మంత్రి హరీశ్రావు వర్చువల్ విధానంలో ప్రారంభించిన సందర్భంలో ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరాం. మంత్రి సానుకూలంగా స్పందించి, సీఎం కేసీఆర్ దృష్టిలో ఉన్నదని చెప్పారు. అనుకున్నట్లుగానే కాలేజీ ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. నర్సంపేటకు జిల్లాస్థాయి దవాఖాన, తెలంగాణ డయగ్నోస్టిక్ హబ్, బస్తీ దవాఖానతోపాటు ప్రస్తుతం మెడికల్ కాలేజీ మంజూరు కావడం ఆనందంగా ఉంది. వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు మంచి అవకాశం. నర్సంపేటకు మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు. – ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
మెడికల్ కళాశాల కోసం ములుగు కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య ఇప్పటికే ప్రేమ్నగర్ వద్ద 25ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి చుట్టూ ప్రహరీ నిర్మించారు. ములుగు మార్కెట్ యార్డు స్థలంలో 2022 మార్చిలో రూ.60కోట్లతో 300 పడకల ప్రభుత్వ దవాఖాన పనులకు మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేయగా ప్రస్తుతం 70శాతం పనులు పూర్తయి భవనాలు అందుబాటులోకి వచ్చాయి. మెడికల్ కళాశాల కోసం ములుగు ప్రభుత్వ దవాఖానను రాష్ట్ర వైద్య విధాన పరిషత్ పరిపాలన నియంత్రణ నుంచి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కు బదిలీ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో జిల్లా కేంద్రంలో ఉన్న 100 పడకల జిల్లా దవాఖాన ఇకనుంచి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి రానున్నది. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ రెండు దవాఖానల్లో మౌలిక వసతులు కల్పించి 100 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. అటు విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్యను అందించడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేస్తున్నారు.
ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 10వేలకు చేరనున్నాయి. రాష్ట్ర వ్యాప్తం గా మరో 8 కొత్త ప్రభు త్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటుకానుండడం హర్షణీయం. మారుమూల ప్రాంతమైన ములుగు జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు వల్ల ఎంతో మేలు కలుగుతుంది. తెలంగాణ ప్రజల ఆరోగ్యంపై, రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుపై గొప్ప ఆలోచనతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందడంతో పాటు స్థానిక విద్యార్థులకు వైద్య విద్య చేరువవుతుంది.
– మంత్రి సత్యవతిరాథోడ్
గిరిజన ప్రాంతమైన ములుగు జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడం ఇక్కడి ప్రజలకు గొప్ప వరంలాంటిది. దశాబ్దాలుగా ఇక్కడ వైద్య సేవలు అందుబాటులో లేక చిన్న అనారోగ్య సమస్యలకే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అడవి బిడ్డలకు ములుగులో ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాల దేవాలయంగా ఉంటుంది. 100 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో రావడం వల్ల స్థానిక విద్యార్థులకు వైద్య విద్య అందే అవకాశముంటుంది. ములుగు జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామ పంచాయతీగా ఉన్న ములుగును జిల్లాగా ఏర్పాటు చేశారు. నేడు మెడికల్ కళాశాలను కూడా మంజూరు చేసినందుకు జిల్లా ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం కూడా గిరిజన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి.
-రాష్ట్ర రెడ్కో చైర్మన్ వై సతీష్రెడ్డి
ములుగు జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేయడం సీఎం కేసీఆర్కు ములుగుపై ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనం. అన్ని రంగాల్లో ములుగు జిల్లా ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు జిల్లా ప్రజలు ఎల్లవేళలా అండగా ఉండాలి. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు చొరవ తీసుకున్న సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ఇతర ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– బడే నాగజ్యోతి, ములుగు జడ్పీ అధ్యక్షురాలు