ఎల్కతుర్తి, అక్టోబర్ 31 : ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా శక్తివంచన లేకుండా ఐదేళ్లు మీకు సేవ చేస్తూ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని సూరారం, వల్భాపూర్, వీరనారాయణపూర్, దగ్గుర్పల్లి, పెంచికల్పేట, కోతులనడుమ గ్రామాల్లో మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల పెద్దిరెడ్డి, జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీశ్కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే తన ధ్యేయమన్నారు. సీఎం కేసీఆర్ మళ్లీ రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయి హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పథకాలు అమలు చేస్తామన్నారు. కేవలం ఓట్ల కోసం మాత్రమే వచ్చే ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలు నమ్మవద్దన్నారు. హుస్నాబాద్లో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిస్తున్న రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
ఎల్కతుర్తి మండలం నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ఈ అభివృద్ధి ఇంకా ముందుకు సాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో పరాయి వారు పోటీ చేస్తే ఓట్లు ఎలా వేస్తామని, ఆత్మగౌరవంతో ఇంటి వారినే గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. ఆయా గ్రామాల్లో పెద్దిరెడ్డి మాట్లాడుతూ మళ్లీ ఎమ్మెల్యేగా సతీశ్కుమార్ లక్ష మెజార్టీతో గెలుస్తారని, అందులో అనుమానం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ క్లచ్ బెంగుళూర్లో ఉంటే, గేర్ ఢిల్లీలో, డ్రైవర్లు హైదరాబాద్లో ఉన్నారని విమర్శించారు. ఏదో రాష్ట్రం నుంచి వచ్చిన నేతలు ఇక్కడి ప్రజలకు ఏం చేయాలో ఎలా తెలుసని ప్రశ్నించారు. టికెట్ల కోసం తన్నుకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉందని, కాంగ్రెస్ పార్టీ సీఎం ఎవరో తెలియదన్నారు. ఆ పార్టీ చెప్తున్న ఆరు గ్యారంటీలకు వారంటీ లేదని, మన పథకాలకు మాత్రం గ్యారంటీ సీఎం కేసీఆర్ అన్నారు. రైతులకు 24గంటల కరంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, నేడు పంజాబ్ని తలదన్నేలా వరిని మన రైతులు పండిస్తున్నారని తెలిపారు. జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ నుంచి ఈ నియోజకవర్గానికి వచ్చిన పొన్నం ప్రభాకర్కు ఈ ప్రాంతంపై అవగాహన లేదన్నారు. ఏ గ్రామం ఎక్కడ ఉంటుందో కూడా ఆయన తెలియదని అన్నారు. పొన్నం ప్రభాకర్ బీసీలకు ఏనాడు కూడా న్యాయం చేయలేదని, ఎంపీగా ఉండి జనగణన గురించి ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేగా సతీశ్కుమార్ నిత్యం ప్రజల్లో ఉంటూ అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల్లో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ మన రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని, ఎమ్మెల్యే సతీశ్కుమార్ ఆయన మార్గంలో నడుస్తూ ఎన్నో అభివృద్ధి పనులు చేశారని కొనియాడారు. ప్రజలు ఆలోచించి కారు గుర్తుకు ఓటేసి మళ్లీ ఎమ్మెల్యేగా సతీశ్కుమార్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మేకల స్వప్న, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్గౌడ్, వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడిశాల సమ్మయ్యగౌడ్, సర్పంచ్లు కుర్ర సాంబమూర్తి, అంబాల మమత, చదిరం వసంత, సామల జమున, బోయినపల్లి రజిత, ఎంపీటీసీలు బోడ అనూష, చెవుల కొమురయ్య, రైల్వే బోర్డు మెంబర్ ఎల్తూరి స్వామి, మార్కెట్ డైరెక్టర్ తంగెడ మహేందర్, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ పోరెడ్డి రవీందర్రెడ్డి, నాయకులు కడారి రాజు, బూర్గుల రామారావు, దేవేందర్రావు, సంపత్రావు, పిట్టల మహేందర్, పెద్ది శ్రీనివాస్రెడ్డి, గొల్లె మహేందర్, బచ్చు ఆనందం, మదన్మోహన్రావు, వెంకటేశ్యాదవ్, అల్లకొండ రాజు, మేకల కోమల, లోకిని సూరయ్య, సామల సురేశ్రెడ్డి, దుగ్యాని సమ్మయ్య, ముప్పు కుమార్, హింగె శివాజీ, కొంగ ప్రవీణ్, వేముల సమ్మయ్య పాల్గొన్నారు.
ఆయా గ్రామాల్లో మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రచారంలో పాల్గొన్నారు. బతుకమ్మలు, కోలాటాలు, బోనాలతో ఘనస్వాగతం పలికారు. అన్ని గ్రామాల్లో వాడవాడలా ర్యాలీగా తిరుగుతూ వొడితెల సతీశ్కుమార్ ప్రజలకు అభివాదం చేశారు. మహిళలు, వృద్ధులు సతీశ్కుమార్కు మంగళ హారతులతో స్వాగతం పలికారు. గౌడ సంఘాల నాయకులు మోకులతో వచ్చి సతీశ్కుమార్కు మద్దతు తెలిపారు. అన్ని గ్రామాల్లో యువకులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. బైక్లపై ఎక్కి ఎమ్మెల్యే సతీశ్కుమార్ వారిని ఉత్సాహ పరిచారు. ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను లెక్కలతో సహా ప్రజలకు సతీశ్కుమార్ వివరించారు. సూరారం గ్రామంలో ప్రచార రథంపై ఉన్న సీఎం కేసీఆర్ చిత్రపటానికి వృద్ధురాలు మొక్కడం అందరినీ ఆకుట్టుకుంది. మొత్తంగా ఎమ్మెల్యే సతీశ్కుమార్ మండలంలో నిర్వహించిన ప్రచారం విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనపడింది.