అధినేత, సీఎం కేసీఆర్కు నర్సంపేట నీరా‘జనం’ పట్టింది. ఎమ్మెల్యే, నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ శివారులోని సర్వాపురంలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు, అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు దండులా తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం సభికులను ఆలోచింపజేయగా, వేదికపై మిట్టపల్లి సురేందర్, ఇతర కళాకారుల ఆటపాటలు ఉర్రూతలూగించాయి. సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ నాయకులు, శ్రేణుల్లో నూతనోత్తేజం నిండింది.
నర్సంపేట/నర్సంపేట రూరల్, నవంబర్13: నర్సంపేట గులాబీ తోటను తలపించింది. సోమవారం పట్టణంలోని సర్వాపురంలో నిర్వహించిన నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గంలోని నర్సంపేట, నల్లబెల్లి, చెన్నారావుపేట, ఖానాపురం, దుగ్గొండి, నెక్కొండ మండలాల నుండి వేలాదిగా ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బహిరంగ సభకు తరలివచ్చి బీఆర్ఎస్కు మద్దతు పలికారు. సభా ప్రాంగంణం నిండిపోవడంతో అక్కడి నుంచి 5, 6కిలో మీటర్ల దూరంలో వేలాది మంది రోడ్లపైనే ఉండిపోయారు. ప్రజలకు ఎక్కడా లోటు రాకుండా ఎమ్మెల్యే పెద్ది ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. మహిళలు, నాయకులు, కార్యకర్తలకు వేర్వేరుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అభిమానులు బీఆర్ఎస్ జెండాలతో ‘జై తెలంగాణ.., జై కేసీఆర్.. జై బీఆర్ఎస్’ అంటూ నినదిస్తూ ర్యాలీగా సభకు చేరుకున్నారు. వలంటీర్లు వాటర్ బాటిళ్లు, ప్యాకెట్లు అందించారు. దివ్యాంగులు సైతం తరలివచ్చి మద్దతు తెలిపారు.
సభలో గాయకుడు మిట్టపల్లి సురేందర్ పాడిన పాటలు ఆలోచింపజేశాయి. ప్రజలు, నాయకులు సైతం గొంతు కలిపారు. జెండా, కండువా, తువ్వాలలు ఊపుతూ డ్యాన్స్ చేశారు. ‘ధరణి వద్దంటున్న దద్దమ్మల్లారా.. రైతుబంధు వద్దనే రాబందుల్లారా.. దళిత బంధు వద్దనే దరిద్రుల్లారా పాపిష్టుల్లారా’ అంటూ సురేందర్ పాడిన పాట ఆకట్టుకున్నది. ‘కారు గుర్తుకు ఓటు వేయాలి.. కేసీఆర్ మళ్లీ రావాలి’.. ‘గులాబీల జెండలే రామక’ పాటలు సభలో మార్మోగాయి.
ప్రజా ఆశీర్వాద సభకు సీపీ అంబర్ కిశోర్ ఝా ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. వరంగల్ ఈస్ట్జోన్ డీసీపీ పీ రవీందర్, నలుగురు ఏసీపీలు, 14మంది సీఐలు, 40మంది ఎస్సైలు, 69మంది ఏఎస్సైలు, 94మంది హెడ్కానిస్టేబుళ్లు, 78మంది మహిళా పోలీసులు, 180మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 480మంది విధులు నిర్వర్తించారు.
నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కావడంతో నర్సంపేట బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. కార్యకర్తలు పోటీ పడి పనిచేయాలని సీఎం సూచించడం వారిలో ఉత్సాహాన్ని నింపింది. తాను చెప్పిన విషయాలపై గ్రామాల్లో చర్చ పెట్టాలని, చర్చల ద్వారానే ప్రజాస్వామ్య పరిణతి వస్తుందని సీఎం సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. కేసీఆర్ మాట్లాడుతున్నంత సేపు కార్యకర్తలు, అభిమానులు జోష్తో ఊగిపోయారు. ఎమ్మెల్యే పెద్ది గురించి సీఎం వివరిస్తుండగా పెద్ద ఎత్తున శ్రేణులు హర్షధ్వానాలు చేశారు.
సభలో ఏర్పాటు చేసిన రౌండ్ ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రాంగణంలో 20కి పైగా రౌండ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో ఫ్యూఛర్ ఆఫ్ ఇండియా అని పేర్కొంటూ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది ఫొటోలు, కారు గుర్తు ముద్రించగా ప్రజలు ఆసక్తిగా తిలకించారు